Ravi Shastri: టీమిండియా మాజీ హెడ్ కోచ్  రవిశాస్త్రి  మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. తన హయాంలో భారత జట్టు రెండు సార్లు   ఆసియా కప్ గెలిచిందని, కానీ ఎవరూ తన గురించి మాట్లాడరని  చెప్పాడు. 

భారత  క్రికెట్ జట్టుకు  సుమారు ఏడేండ్ల పాటు హెడ్ కోచ్ గా వ్యవహరించిన  రవిశాస్త్రి.. 2021 లో భారత జట్టు  దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో ఓడిన తర్వాత  తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  ఆ స్థానంలో  రాహుల్ ద్రావిడ్ భారత  జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు.  రవిశాస్త్రితో పాటు ద్రావిడ్ కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కు విజయాలు అందించలేకపోయారు. తాజాగా రవిశాస్త్రి ఇదే విషయమై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 తన హయాంలో  భారత జట్టు రెండు సార్లు ఆసియా కప్ గెలిచిందని, కానీ  జనాలు దాని గురించి పట్టించుకోరని,  ద్రావిడ్ ఆసియా కప్ లో ఇండియాను నడిపించడంలో విఫలమవడంతో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారని అన్నాడు. 

శాస్త్రి మాట్లాడుతూ... ‘కొన్ని విషయాల్లో ఓపిక అవసరం. ముఖ్యంగా  భారీ టోర్నీలలో ఆడిన ప్రతీసారి  టైటిల్ కొట్టలేం.  ద్రావిడ్ కు  కూడా కాస్త టైమ్ పడుతుంది.  అతడు  ఎన్సీఏ హెడ్ గా చేశాడు. ఇండియా-ఏ కు పనిచేశాడు.  ఇప్పుడు భారత జట్టుకు కూడా   సేవలందిస్తున్నాడు.   క్రికెటర్లను ఎలా డీల్ చేయాలో ద్రావిడ్ కు బాగా తెలుసు. మన దేశంలో  జనాలకు  జ్ఞాపకశక్తి చాలా తక్కువ.   మీరు (టీమిండియా)  భారీ టోర్నీలు ఆడేప్పుడు    గెలవాలంటే గెలవాలంతే.  నా హయాంలో  భారత జట్టు రెండుసార్లు (2016, 2018) ఆసియా కప్ గెలిచింది.  అసలు దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఆ విషయం కూడా ఎవరికీ గుర్తు లేదు.  ఇంతవరకూ ఎవరైనా దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా..? లేదు.

కానీ గతేడాది  దుబాయ్ లో ముగిసిన ఆసియా కప్ గురించి అందరూ మాట్లాడతారు. ఎందుకంటే  ఆ టోర్నీలో భారత్ ఓడిపోయింది  కదా.   ఎందుకు ఇలా జరుగుతుంది..?   అందుకే నేను చెబుతున్నా. ఆటగాళ్లు ప్రతీసారి  తమ  ప్రయత్నాలను  చేయాలి.    అప్పుడే విజయాలు సాధ్యమవుతాయి...’అని చెప్పాడు.  

కాగా  ద్రావిడ్ హయాంలో   భారత్  గతేడాది ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచకప్ లో కూడా  ఓడింది. అయితే అతడికి మరో రెండు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఏడాది  జూన్ లో ఇంగ్లాండ్ వేదికగా  భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగాల్సి ఉంది. అంతేగాక ఈ ఏడాది అక్టోబర్ లో  భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.  ఈ రెండింటికీ మధ్య సెప్టెంబర్ లో మరోసారి ఆసియా కప్ కూడా ఉంది. మరి ఈ మూడింటిలో ద్రావిడ్ మార్గనిర్దేశకుడిగా ఉన్న భారత జట్టు ఎందులో విజేతలుగా నిలిచేనో..?  కాగా   ద్రావిడ్  ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న వన్డే సిరీస్ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నాడు.  ఇది ముగిశాక  రెండు నెలల పాటు విరామం తీసుకుంటాడు.  రెండు నెలల పాటు  సాగే ఐపీఎల్  తర్వాత తిరిగి డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ ఆటగాళ్లతో కలుస్తాడు.