Pakistan Tour Of Sri Lanka: ఆర్థిక సంక్షోభంతో  అతలాకుతలమవుతున్న శ్రీలంక.. పాకిస్తాన్ తో ఈ ఏడాది జులై-ఆగస్టు లో నిర్వహించతలపెట్టిన వన్డే సిరీస్  నిర్వహణ నుంచి తప్పుకుంది. అది తమ వల్ల కాదని చేతులెత్తేసింది. 

ఒకవైపు ద్రవ్యోల్బనం మరోవైపు ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో నిత్యం అట్టుడుకుతున్న శ్రీలంకలో క్రికెట్ నిర్వహణ కూడా కష్టంగా మారింది. దేశంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా తాము వన్డే సిరీస్ నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి తేల్చి చెప్పింది. అధికారిక కరెంట్ కోతలతో దేశమంతా అంధకారమవుతున్న వేళ.. డే అండ్ నైట్ వన్డేలను నిర్వహించడం అంటే తమకు తలకు మించిన భారం అవుతుందని పీసీబీకి తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం.. జులై-ఆగస్టు లలో పాకిస్తాన్ జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా రెండు టెస్టులు జరుగనున్నాయి. 

అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాము వన్డే సిరీస్ ను నిర్వహించలేమని శ్రీలంక.. పాక్ ను కోరింది. అయితే వన్డేలను నిర్వహించకున్నా టెస్టులు మాత్రం ఉంటాయని తెలిపింది. టెస్టులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2021-23) లో భాగంగా జరుగుతున్నాయి. వన్డేలు మాత్రం వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగం కావు.. దీంతో పాక్ కూడా లంక అభ్యర్థన కు ఓకే చెప్పింది. ఇదిలాఉండగా.. ఈ రెండు టెస్టులను కూడా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే వారం రోజులు ముందుగా నిర్వహించాలని లంక.. పాక్ ను కోరింది. దీనిపై పాక్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 

లంక.. పాక్ తో రెండు టెస్టుల షెడ్యూల్ ను వారం రోజులు ముందుకు జరిపించడానికి కారణముంది. ఆగస్టులో లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) నిర్వహించేందుకు బోర్డు సన్నాహకాలు చేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితితో పాటే లంక బోర్డు కూడా నిండా మునిగింది. ఎల్పీఎల్ ద్వారా అయినా కాస్త ఆర్థికంగా కుదుటపడాలని బోర్డు భావిస్తున్నది. లంకలో ఇప్పుడు ఎల్పీఎల్ నిర్వహించినా ప్రేక్షకులు స్టేడియాలకు రావడం కష్టమే. అందుకే దానిని యూఏఈలో నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నది.

కాగా ఈ ఏడాది లంకలో జరగాల్సి ఉన్న ఆసియా కప్ కూడా అక్కడ జరగడం అనుమానంగానే ఉంది. ఇది కూడా యూఏఈకి తరలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా.. వచ్చే నెలలో ఆసీస్.. లంక పర్యటనకు రావాల్సి ఉంది. లంకలో ఆసీస్.. జూన్ 7 నుంచి జులై 12 వరకు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ఆసీస్ జట్టు ఇప్పటికే తమ జట్టును కూడా ప్రకటించింది. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో లంకలో ఆసీస్ పర్యటన సాగుతుందా..? లేదా..? అనేది కూడా అనుమానమే.