సెంచరీ నెం.5! వరల్డ్ రికార్డు సృష్టించిన ఎన్ జగదీశన్... విజయ్ హాజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ బాది...
అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన ఎన్ జగదీశన్... లిస్టు ఏ క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదు సెంచరీలు బాదిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు...
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఓ స్పెషాలిటీ ఉంది. వేరే టీమ్స్ తరుపున ఆడి, సీఎస్కేలోకి వెళ్లిన ప్లేయర్లు... స్టార్లుగా మారతారు. సీఎస్కేలోనే కెరీర్ ప్రారంభించాలని అనుకున్నవాళ్లు మాత్రం ఏళ్ల పాటు రిజర్వు బెంచ్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. 14 సీజన్లలో సీఎస్కే నుంచి వెలుగులోకి వచ్చిన కుర్రాళ్ల సంఖ్య చాలా తక్కువ.. అయితే ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత సీన్ కాస్త మారింది...
రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ చౌదరి వంటి కుర్రాళ్లు... వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే హరి నిశాంత్, ఎన్ జగదీశన్ వంటి దేశవాళీ స్టార్లు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. 2023 ఐపీఎల్ సీజన్కి ముందు ఎన్ జగదీశన్ ఉరఫ్ నారాయణ్ జగదీశన్ని మినీ వేలానికి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మూడు సీజన్లలో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు 30+ స్కోర్లు చేసిన ఎన్ జగదీశన్... విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో తన సత్తా చూపిస్తున్నాడు...
ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 112 బంతుల్లో 114 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన నారాయణ్ జగదీశన్, ఛత్తీస్ఘడ్తో మ్యాచ్లో 113 బంతుల్లో 107 పరుగులు చేశాడు. గోవాతో మ్యాచ్లో 140 బంతుల్లో 168 పరుగులు, హర్యానాతో మ్యాచ్లో 123 బంతుల్లో 128 పరుగులు చేసిన జగదీశన్.. వరుసగా నాలుగు సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, దేవ్దత్ పడిక్కల్ రికార్డును సమం చేశాడు...
తాజాగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు ఎన్ జగదీశన్. లిస్టు ఏ క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు జగదీశన్. 44 బంతుల్లో 55 పరుగులు, 70 బంతుల్లో సెంచరీ, 102 బంతుల్లో 159 పరుగులు చేసిన జగదీశన్, ఆ తర్వాత బౌండరీల మోత మోగించాడు... 114 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్నాడు...
129 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్సర్లతో 250 పరుగులు చేసిన ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్తో కలిసి తొలి వికెట్కి 416 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించాడు. లిస్టు ఏ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్కి ఇదే అత్యధిక భాగస్వామ్యం.
సాయి సుదర్శన్ 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 152 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేసిన ఎన్ జగదీశన్, ఛేతన్ ఆనంద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత బాబా అపరాజిత్ 31, బాబా ఇంద్రజిత్ 31 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది తమిళనాడు. లిస్టు ఏ క్రికెట్లో 500 మార్కు దాటిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది తమిళనాడు. అలాగే లిస్టు ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్గా జగదీశన్ రికార్డు క్రియేట్ చేశాడు.