ఎవరితో పోల్చినా పర్లేదు, కోహ్లీతో మాత్రం వద్దు.. బాబర్ అజామ్
తనను కోహ్లితో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్ కాలేదన్నాడు. కాగా, పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లైన జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమాముల్ హక్లతో పోలికనే ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు.
తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చవద్దంటూ పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. బాబర్ అజామ్ ను ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో తరచు పోల్చుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను కోహ్లితో పోల్చడాన్ని పెద్దగా ఆస్వాదించనని అజామ్ తాజాగా తెలిపాడు.
పాకిస్తాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ అయిన అజామ్.. విలేకరులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడాడు. దీనిలో భాగంగా తనను కోహ్లితో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్ కాలేదన్నాడు. కాగా, పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లైన జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమాముల్ హక్లతో పోలికనే ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు.
వారితో పోల్చితే తప్పకుండా చాలా గొప్పగా అనుకుంటానని అజామ్ అన్నాడు. ‘ నన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు అది పాకిస్తాన్ ప్లేయర్స్ అయితేనే దాన్ని ఆస్వాదిస్తా. కోహ్లితో పోలిక కంటే పాక్ దిగ్గజాలతో పోల్చినప్పుడు గౌరవంగా భావిస్తా. మాకు మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమాముల్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారితో పోల్చండి.. అప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది’ అని అజామ్ తెలిపాడు.
టీ20ల్లో అజామ్ నంబర్ వన్ ర్యాంకులో ఉండగా, వన్డేల్లో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అజామ్ను కోహ్లితో పోల్చడం ఎక్కువైంది. అయితే అది తనకు నచ్చదనే విషయాన్ని అజామ్ తన మాటల ద్వారా వెల్లడించాడు. కోహ్లి సాధించిన ఘనతలు పరంగా చూస్తే అజామ్ చాలా దూరంలోనే ఉన్నాడు., అయినప్పటికీ కోహ్లితో పోలిక వద్దని చెప్పడం, పాక్ దిగ్గజాలతో పోల్చాలని చెప్పడం గమనార్హం.