Jasprit Bumrah: బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..!! జాన్సేన్ పై రివేంజ్ తీర్చుకున్న టీమిండియా పేసర్
Bumrah Revnge On Jansen: వాండరర్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో జాన్సేన్.. బుమ్రాను పదేపదే కవ్వించాడు. కానీ మూడో టెస్టులో బుమ్రా అతడికి బుద్ది చెప్పాడు.
పుష్ప సినిమాలో సునీల్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’ అంటూ బన్నీ చెప్పే ఈ డైలాగ్ కు థియేటర్లు అదిరిపోయాయి. ఇప్పుడు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా.. రెండో టెస్టులో తనను గెలికిన దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్క్ జాన్సేన్ కు ఇదే విధంగా బదులు తీర్చుకున్నాడు. రెండో టెస్టులో తనను అనవసరంగా గెలికిన జాన్సేన్ కు అసలైన బుమ్రా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
వాండరర్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో జాన్సేన్.. బుమ్రాను పదేపదే కవ్వించాడు. అతడి శరీరంపైకి బంతులు విసిరడమే గాక ఓపికగా ఉన్న బుమ్రాను మాటలతో రెచ్చగొట్టాడు. అప్పటిదాకా సహనంగా ఉన్న బుమ్రా.. జాన్సేన్ కవ్వింపులతో విసిగిపోయి అతడితో తాడో పేడో తేల్చుకోవడానికి వెళ్లాడు. కానీ ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
మూడో టెస్టులో దీనికి బదులు తీర్చుకున్నాడు బుమ్రా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 62వ ఓవర్లో బుమ్రా బౌలింగ్ కు దిగాడు. అవతలి ఎండ్ లో జాన్సేన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో రెండో బాల్ వేసిన బుమ్రా.. జాన్సేన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ బుమ్రా.. అతడి మాదిరి వెకిలి చేష్టలు వేయలేదు. కామ్ గా అతడిని చూస్తూ ఉండిపోయాడు. జాన్సేన్ మాత్రం తలదించుకుని పెవిలియన్ కు వెళ్లాడు. ఇదిలాఉండగా జాన్సేన్ క్లీన్ బౌల్డ్ కాగానే భారత సారథి విరాట్ కోహ్లి మాత్రం.. తనదైన స్టైల్ లో అగ్రెసివ్ గా కనిపించాడు.
ఇక రెండో టెస్టులో బుమ్రా ను జాన్సేన్ కవ్విండచం.. దానికి అతడు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు మూడో టెస్టులో జాన్సేన్ ఔటైన విధానంపై ట్విట్టర్ లో పలువురు వీడియోలు రూపొందించారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ‘బుమ్రా తో పెట్టుకోద్దు..’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కేప్టౌన్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత జట్టు దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే నిలువరించిన విషయం తెలిసిందే. 210 పరుగులకే ఆ జట్టు పెవిలియన్ చేరింది. బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. టెస్టులలో ఐదు వికెట్లు తీయడం బుమ్రా కు ఇది ఏడోసారి. నాలుగేండ్ల క్రితం ఇదే కేప్టౌన్ లో అరంగ్రేటం చేసిన బుమ్రా.. ఇప్పుడు అక్కడే సఫారీలకు చుక్కలు చూపెట్టాడు. బుమ్రా విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. పుజారా (9), కోహ్లి (14) క్రీజులో ఉన్నారు.