పంత్కు యాక్సిడెంట్.. అప్పుడు నా గుండె వేగం ఎలా ఉందో మాటల్లో చెప్పలేను.. డబుల్ సెంచరీ హీరో కామెంట్స్
Rishabh Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడిని డెహ్రాడూన్ నుంచి ముంబైకి తరలించి ఇక్కడే చికిత్స అందజేయాలని బీసీసీఐ భావిస్తున్నది.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గత శుక్రవారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ వద్ద అతడు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం అతడిని బీసీసీఐ.. ముంబైకి తరలించింది. పంత్ ప్రమాదవార్త క్రికెట్ అభిమానులతో పాటు తన సహచర క్రికెటర్లకు కూడా షాక్ కు గురి చేసింది. అయితే ఈ ప్రమాద వార్త తెలియగానే తన గుండె వేగం విపరీతంగా ఉందని టీమిండియా మరో యువ ఆటగాడు, పంత్ తో కలిసి అండర్ - 19 నుంచి ఆడుతున్న ఇషాన్ కిషన్ అన్నాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఇషాన్ మాట్లాడాడు.
కిషన్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ విషయం (పంత్ కు యాక్సిడెంట్) గురించి తెలిసినప్పుడు కచ్చితమైన సమాచారం లేదు. ఏదో నార్మల్ యాక్సిడెంట్ అయిఉంటుందిలే అనుకున్నా. కానీ తర్వాత పంత్ చాలా సీరియస్ గా ఉన్నాడని తెలియడంతో చాలా ఆందోళన చెందా.
రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నంత సేపు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నేను మాటల్లో చెప్పలేను. పంత్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. పంత్ అద్భుతమైన ఆటగాడు. టీమ్ కోసం ఎంతలా పోరాడాడో మనకు తెలుసు. అతడు త్వరలోనే తిరిగి టీమిండియాలో చేరతాడు..’అని ఆశాభావం వ్యక్తం చేసాడు.
ఇదిలాఉండగా ఇషాన్ కిషన్ కు రోడ్డు ప్రమాదమైన విషయం అతడికి అభిమానుల ద్వారా తెలిసింది. రంజీ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ ఆడుతుండగా తనకోసం ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం వచ్చిన అభిమానులు.. ఇషాన్ కు పంత్ ప్రమాదం గురించి చెప్పారు.
రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్.. సర్వీసెస్ తో మ్యాచ్ లో ఇషాన్ బరిలోకి దిగాడు. మ్యాచ్ మధ్యలో ఇషాన్.. అక్కడికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చి సెల్ఫీలు దిగాడు. ఆ క్రమంలో ఓ అభిమాని.. ‘భయ్యా, రిషభ్ పంత్ కు యాక్సిడెంట్ అయింది తెలుసా..?’ అని అడిగాడు. దానికి ఇషాన్.. ‘ఏంటి..? ఎప్పుడు..?’ అని నివ్వెరపోయాడు. అప్పుడు ఫ్యాన్స్.. మూడు రోజులైంది అని చెప్పాడు. అతడే కొనసాగిస్తూ.. పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడని, ప్రమాదమేమీ లేదని అన్నాడు. దాంతో ఇషాన్.. ‘ఓకే’ అన్నట్టుగా వారితో ఫోటోలు దిగి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
కాగా.. రిషబ్ పంత్ని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నట్టు తెలిపాడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ. ‘రిషబ్ పంత్ని ముంబైకి తరలిస్తున్నాం. అక్కడ అతని ఎముక గాయాలకు చికిత్స జరుగుతుంది. అవసరమైతే యూఎస్ఏ లేదా యూఏకి పంపిస్తాం. బీసీసీఐ స్పోర్ట్స్ డాక్టర్, అథోపెడిక్ దిన్షా పర్నావాలా పర్యవేక్షణలో రిషబ్ పంత్కి ట్రీట్మెంట్ జరుగుతోంది... ’ అంటూ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.