బాబూ బాబరూ.. స్వదేశంలో ఆధిపత్యం చెలాయించాలంటే అంత వీజీ కాదు.. కోహ్లీ రికార్డుల ముందు నువ్వెక్కడ..!
PAKvsENG Test Series: 17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరీస్ ను వైట్ వాష్ చేసింది. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అవమానకర ఓటమి.
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ ఒక జట్టు ఆ టీమ్ ను క్లీన్ స్వీప్ చేసింది లేదు. కానీ తొలిసారి పాక్ సారథి బాబర్ ఆజమ్ సారథ్యంలో ఆ జట్టు ఈ అపప్రదను మూటగట్టుకుంది. రాక రాక తమ దేశానికి వచ్చిన ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ తిన్నది. రావల్పిండి, ముల్తాన్, కరాచీ.. ఇలా వేదికలు మారినా పాకిస్తాన్ తలరాత మారలేదు. వరుసగా మూడు టెస్టులలోనూ ఓడి క్లీన్ స్వీప్ అయింది. ఈ ఓటమితో పాక్ సారథి బాబర్ ఆజమ్ పై ఆ జట్టు మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు నువ్వు కెప్టెన్సీకి పనికిరావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక బాబర్ బ్యాటింగ్ తో పాటు అతడి కెప్టెన్సీని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పోల్చేవారికి.. కోహ్లీ ఫ్యాన్స్ గూబ గుయిమనేలా సమాధానాలు ఇస్తున్నారు. కరాచీ టెస్టులో పాకిస్తాన్ ఓడిన తర్వాత కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్ బాబర్ ఆజమ్ అండ్ కో. పై మీమ్స్, ట్రోల్స్ తో ఆటాడుకుంటున్నారు. ఇకనైనా బాబర్ తనను తాను తోపు అనుకునేలా ఊహించుకోవడం మరిచి వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని స్వయంగా పాకిస్తాన్ ఫ్యాన్స్ సూచనలిస్తున్నారు.
స్వదేశంలో అదీ ముఖ్యంగా టెస్టులలో ఆధిపత్యం చెలాయించడం అనేది అంత వీజీ కాదని బాబర్ కు సూచిస్తున్నారు. కోహ్లీతో పోల్చుకునేంతలా బాబర్ ఇంకా ఎదగలేదని చురకలు అంటిస్తున్నారు. 2014లో ఎంఎస్ ధోని నుంచి టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న కోహ్లీ టీమిండియాను నెంబర్ వన్ స్థానానికి చేర్చాడు. సారథిగా కోహ్లీ.. టెస్టులలో 68 మ్యాచ్ లలో సారథ్యం వహించగా అందులో భారత్ 40 మ్యాచ్ లు గెలిచింది. 11 మ్యాచ్ లు డ్రా చేసుకుంది. 17 మ్యాచ్ లలో ఓడింది. కోహ్లీ సారథ్యంలో భారత జట్టు.. స్వదేశంలో ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు.
కానీ బాబర్ సారథ్యంలోని పాకిస్తాన్.. ఇతర దేశాలకు వెళ్లి ఆధిపత్యం చెలాయించడం సంగతి పక్కనబెడితే కనీసం స్వంత దేశంలో కూడా సరిగా ఆడటం లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆసీస్.. 1-0తో గెలుచుకుంది. తాజాగా ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ లూ గెలిచింది. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్ లు (స్వదేశంలో) ఓడిన తొలి సారథి బాబర్ మాత్రమే. మొత్తంగా ఇప్పటివరకూ 16 టెస్టులకు సారథిగా ఉన్న బాబర్.. 8 మ్యాచ్ లు గెలిచాడు. ఐదింటిలో ఓడాడు. మూడు డ్రా గా ముగిశాయి.