DDCA President: ఢిల్లీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. రోహన్ పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది.
కేంద్ర మాజీ మంత్రి దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు, ప్రస్తుతం ఢిల్లీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న రోహన్ జైట్లీ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ బీసీసీఐకి లేఖ రాసింది. న్యాయం కోరి రోహన్ దగ్గరికెళ్తే ఆయన మాత్రం తన అవసరాన్ని ఆసరాగా తీసుకుని లైంగికంగా వేధించడమే గాక ఇప్పుడు చంపేస్తానని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే భారత క్రికెట్ రహస్యాలను బట్టబయలు చేసిన చేతన్ శర్మ లీక్డ్ వీడియోతోనే సతమతమవుతున్న బీసీసీఐకి ఇది మరో షాక్.
వివరాల్లోకెళ్తే.. జ్యోత్స్న సహనీ అనే ఓ మహిళ రోహన్ పై లైంగిక ఆరోపణలు చేసింది. ప్రముఖ జర్నలిస్టు సాక్షి జోషి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలతో ఓ వీడియోను రూపొందించింది. రోహన్ తనను ఎలా కలిశాడు..? ఎప్పుడు కలిశాడు..? అతడు తనను ఎలా వేధించాడు..? వంటి వివరాలన్నీ జత కూర్చి జ్యోత్స్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ లకు లేఖ రాసింది.
లేఖలో జ్యోత్స్న.. ‘‘నేను 2021 మే 03న తొలిసారి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో రోహన్ ను కలిశాను. నా వివాహ బంధానికి సంబంధించిన కేసు గురించి రోహన్ ను సాయం కోరాను. నాకు సాయం చేస్తానని చెప్పిన రోహన్.. నన్ను తన అవసరాలకు వాడుకున్నాడు. రోహన్ నాతో.. ‘ఇండియాలో న్యాయ వ్యవస్థను నేను కంట్రోల్ చేస్తా. హై కోర్టులు, సుప్రీం కోర్టులో ఎక్కడైనా సరే నాకు పలుకుబడి ఉంది. నీకు సాయం అందించే బెస్ట్ పర్సన్ ను నేనే. కోర్టులలో జడ్జీలు అందరూ నాకు అనుకూలంగా ఉంటారు’ అని చెప్పడమే గాక భారత్ లో లీగల్ బిజినెస్ ఎలా వర్కవుట్ అవుతుందో కూడా వివరించాడు..
ఆ క్రమంలోనే రోహన్ నాకు నిత్యం ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. ఏదో ఓ వంకతో నన్ను కలిసేవాడు. మా చర్చల్లో భాగంగా తాను తన భార్యతో సుఖంగా లేనని, నిత్యం ఏదో ఓ గొడవతో సతమతమవుతుంటానని చెప్పేవాడు. నేను అడగకున్నా వాటి గురించి వివరించేవాడు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా మా నాన్న చనిపోయాడు. అప్పుడు నేను ఎమోషనల్ గా వీక్ అయ్యాను. దానిని ఆసరగా తీసుకున్న రోహన్.. నన్ను లైంగికంగా శారీరకంగా వేధించాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి నన్ను అధికారికంగా పెళ్లాడతానని మాటిచ్చాడు...’ అని పేర్కొంది.

తనను పెళ్లాడతానని చెప్పిన రోహన్ తర్వాత మాట మార్చాడని ఇప్పుడు అతడు తన మనుషుల ద్వారా తనను బెదిరిస్తున్నాడని జ్యోత్స్న తన లేఖలో పేర్కొంది. అంతేగాక హోటల్ లో తనను కలిసేందుకు గాను డీడీసీఏ నిధుల నుంచి రూమ్ లను బుక్ చేసేవాడని తెలిపింది. ‘రోహన్ వల్ల నాకు ప్రాణభయం ఉంది. ఈ ఏడాది జనవరి 29న నేను మా కాలనీలో వాకింగ్ కు వెళ్లినప్పుడు ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి రోహన్ తో నా రిలేషన్షిప్ గురించి బయట ఎక్కడైనా చెబితే నా ముఖం మీద యాసిడ్ పోస్తామని.. తమ మాట వినకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈనెల (ఫిబ్రవరి) 21న కూడా ఇదే ఉదంతం రిపీట్ అయింది...’ అని రాసుకొచ్చింది.
మరి దీనిపై బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎలా స్పందిస్తారు..? రోహన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
