చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు యూకే పీఎం ఎలక్షన్స్కు సిద్ధమవుతున్నాడు : పాక్ కామెంటేటర్కు కౌంటరిచ్చిన వీరూ
Virender Sehwag: ట్విటర్లో వీరేంద్ర సెహ్వాగ్ ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తాజాగా వీరూ.. పాకిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ జైద్ హమీద్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్, మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. క్రీడలతో పాటు సమకాలీన అంశాలపైనా వీరూ సందర్భోచితంగా స్పందిస్తూ.. విషయంతో పాటు వినోదాన్నీ పంచుతాడు. తాజాగా ఈ నజఫ్గడ్ నవాబ్.. పాకిస్తాన్ పొలిటికల్ కామెంటేటర్ జైద్ హమీద్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. క్రీడాకారుల పేర్లను వాడుకుని ఇరు దేశాల మధ్య విద్వేషం చిమ్మాలన్న అతడి ఆలోచనను మొగ్గలోనే తుంచేశాడు.
అసలు విషయానికొస్తే.. ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా పాకిప్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 90 మీటర్ల దూరం బల్లెం విసిరి రికార్డు సృష్టించడమే గాక స్వర్ణం కూడా నెగ్గాడు. అతడిని కీర్తిస్తూ ట్వీట్ చేసే క్రమంలో హమీద్ అడ్డంగా దొరికిపోయాడు.
హమీద్ ట్వీట్ చేస్తూ.. ‘పాకిస్తానీ అథ్లెట్ అర్షద్ నదీమ్ సాధించిన విజయం మరింత మధురమైనదిగా మారింది. ఎందుకంటే అతడు ఇండియన్ జావెలిన్ త్రోయర్ ఆశిష్ నెహ్రాను ఓడించాడు. గతంలో ఆశిష్.. అర్షద్ నదీమ్ ను ఓడించాడు. ఇప్పుడు నదీమ్ అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు..’ అని ట్వీటాడు.
ఈ ట్వీట్ వేలాది ఫోన్లను దాటుకుంటూ వీరూ కంటపడింది. ఇక మన వీరూ ఊరుకుంటాడా.. హమీద్ ట్వీట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తూ.. ‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ఇప్పుడు యూకే ప్రధానమంత్రి ఎన్నికలకు పోటీ పడుతున్నాడు. నువ్వు కాస్త చిల్ అవ్వు..’ అని కౌంటరిచ్చాడు.
హమీద్ అవగాహనరాహిత్యంతో వీరూ చేతిలో బలయ్యాడు. ఆశిష్ నెహ్రా క్రికెటర్. అర్షద్ ను ఓడించింది నీరజ్ చోప్రా. కానీ కామన్వెల్త్ గేమ్స్ కు ముందు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో చోప్రా రజతం నెగ్గాడు. ఆ తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో అతడు కామన్వెల్త్ గేమ్స్ కంటే మూడు రోజులు ముందు ఈ క్రీడల నుంచి తప్పుకున్నాడు. గతంలో నీరజ్ చోప్రా పాల్గొన్న ఏ ఈవెంట్ లో కూడా నదీమ్ పతకం నెగ్గలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ స్వర్ణం నెగ్గాడు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో చోప్రా రజతం గెలిచాడు. ఈ రెండు ఈవెంట్లలో నదీమ్.. కనీసం కాంస్యం కూడా గెలవలేదు.