ICC Womens World Cup 2022: ఇంగ్లాండ్‌పై 12 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా... బంగ్లాదేశ్‌ను 32 పరుగుల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా...

ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు శుభారంభం చేశాయి. ఆస్ట్రేలియా మహిళా జట్టు, ఇంగ్లాండ్‌ను ఓడిస్తే, సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్, బంగ్లాదేశ్‌ను ఓడించి తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది...

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్ ఆలీసా హేలీ 35 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా ఓపెనర్ రచెల్ హేన్స్, కెప్గెన్ మెగ్ లానింగ్ కలిసి రెండో వికెట్‌కి 196 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

మెగ్ లానింగ్ 110 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 86 పరుగులు చేసి అవుట్ కాగా రచెల్ హేన్స్ 131 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేసింది. బెత్ మూనీ 19 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు, ఏలీసా పెర్రీ 5 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ మహిళా జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. టమ్మీ బీమోంట్ 82 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేయగా హేథర్ నైట్ 51 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసింది. 

నటాలియా సివర్ 85 బంతుల్లో 13 ఫోర్లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అమీ ఎలెన్ జోన్స్ 4, డానెల్లీ వ్ాయట్ 7, సోఫియా డక్లీ 28, కేథరిన్ బ్రెంట్ 25 పరుగులు చేసి అవుట్ కాగా విజయానికి 12 పరుగుల దూరంలో ఆగిపోయింది ఇంగ్లాండ్...

బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళా జట్టు 49.5 ఓవర్లలో 207 పరుగులు చేసింది. వాల్వరట్ 52 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేయగా, క్యాప్ 42, టైరన్ 39, సునే లూజ్ 25 పరుగులు చేశారు. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ మహిళా జట్టు 49.3 ఓవర్లలో 175 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

షర్మీన్ అక్తర్ 34, నిగర్ సుల్తానా 29, రుమానా అహ్మద్ 21, రితు మోనీ 27, షమీనా సుల్తానా 27 పరుగులు చేశారు. సఫారీ బౌలర్ అయబోంగ ఖాఖా 10 ఓవర్లలో 3 మెయిడిన్లతో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా భారత జట్టు, మార్చి 6న దాయాది పాకిస్తాన్ మహిళా జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మార్చి 10న తలబడుతుంది మిథాలీ సేన... రెండు వార్మప్ మ్యాచుల్లోనూ మంచి విజయాలు అందుకున్న భారత మహిళా జట్టు, ఈసారి వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామిలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్.