Pakistan vs Australia: పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య కరాచీలో జరుగుతున్న రెండో టెస్టులో తిరుగులేని స్థానంలో ఉంది ఆసీస్. ఈ క్రమంలో పాక్ కు చెందిన ఓ అభిమాని ఫ్లకార్డు చేతబట్టుకుని...
కరాచీ వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ టెస్టులో పర్యాటక జట్టు తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆటతో పాటు ఆటేతర విషయాలు కూడా ఈ మ్యాచుకు హైలైట్ గా నిలుస్తున్నాయి. రెండో టెస్టులో భాగంగా ఆసీస్ జట్టు రెండు రోజుల పాటు నిరాటంకంగా బ్యాటింగ్ చేయడం.. మూడో రోజు కూడా కొనసాగించడంపై పాక్ ఫ్యాన్స్ ఆ దేశ బౌలర్లపై అసహనానికి గురయ్యారు. వారిని ఏమీ అనలేక ప్రత్యర్థి జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ను ‘ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్న..’ అని బతిమిలాడుకున్నారు.
రెండో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకుంది ఈ ఘటన. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 450 ప్లస్ స్కోరు దాటిన నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన ఓ అభిమాని ఫ్లకార్డును పట్టుకుని గ్రౌండ్ లో హల్చల్ చేశాడు.
ఫ్లకార్డులో అతడు.. ‘కమిన్స్ భాయ్.. ప్లీజ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయు..’ అని రాశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 171వ ఓవర్లో.. కేరీ, స్టార్క్ లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగింది ఈ ఘటన. కెమెరామెన్ కన్ను సడెన్ గా అతడి మీద పడింది. ఇక చూచాచయగా అటువైపు చూసిన కమిన్స్ కూడా ఫ్లకార్డు పట్టుకున్న వ్యక్తిని చూశాడు. అతడిని చూసి నవ్వుతూ.. ‘నేను చేయను బ్రదర్’ అన్నట్టుగా తల ఊపాడు.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 556 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఉస్మాన్ ఖవాజా (160) సెంచరీతో పాటు స్టీవ్ స్మిత్ (72), అలెక్స్ కేరీ (93) లు రాణించారు. ఇక పాకిస్థాన్ ను తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే ఆలౌట్ చేసి 408 పరుగుల ఆధిక్యం సాధించినా ఆసీస్ మాత్రం ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించలేదు. తిరిగి రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ కు వచ్చి 97 పరుగులు చేసింది. ఫలితంగా 506 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. టీ సమయానికి 48 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (1), అజర్ అలీ (6) లు త్వరగానే నిష్క్రమించినా.. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (44 నాటౌట్) తో కలిసి కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. ఇవాళ ఆట నాలుగో రోజు కాగా.. మరో రోజు ఆట మిగిలుంది.
కాగా.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్ పై ఆ జట్టు మాజీ బౌలర్ షోయభ్ అక్తర్ తనను తానే ట్రోల్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో పాక్ బ్యాటర్ల వైఫల్యాన్ని చూసి.. ‘హా.. భాగా భయమవుతున్నది. నాక్కూడా....’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు.
