CSK vs MI: మ్యాచ్ను మలుపు తిప్పింది ఆ క్యాచులే...
బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి రెండు అద్భుతమైన క్యాచులు అందుకున్న డుప్లిసిస్... ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబై...
IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఆరంభ మ్యాచ్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. నిజానికి మొదటి వికెట్కి 46 పరుగుల భాగస్వామ్యం వచ్చిన తర్వాత ముంబై తేలిగ్గా 200+ స్కోరు చేస్తుందని భావించారంతా. ఓపెనర్లు అవుటైన తర్వాత కూడా హార్ధిక్ పాండ్యా, సౌరబ్ తివారీ క్రీజులో ఉన్న సమయంలో ముంబై జట్టు మంచి పటిష్ట స్థితిలోనే కనిపించింది. అయితే ఈ ఇద్దరూ ఒకే ఓవర్లో అవుట్ కావడం ముంబై ఇన్నింగ్స్ను మలుపు తిప్పింది.
రవీంద్ర జడేజా వేసిన 15వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడబోయిన తివారీని అద్భుతమైన క్యాచ్తో అవుట్ చేశాడు డుప్లిసిస్. అదే ఓవర్లో ఐదో బంతికి పాండ్యా కూడా ఇదే తరహాలో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి మరీ పాండ్యా కొట్టిన షాట్ను అందుకున్నాడు డుప్లిసిస్.
ఒకే ఓవర్లో ఈ హిట్టర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో ముంబై బ్యాటింగ్ లైనప్ గాడి తప్పింది. ప్యాటిన్సన్ కూడా డుప్లిసిస్ క్యాచ్ వల్లే పెవిలియన్ చేరాడు. మొత్తానికి డుప్లిసిస్ కారణంగా 15వ ఓవర్ వరకూ 180+ స్కోరు చేసేలా కనిపించిన ముంబై 162 పరుగులకే పరిమితమైంది.