టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... రేసిజం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దర్యాప్తు...
సిడ్నీ టెస్టు మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...
మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు...
కాసేపు ఆటను నిలిపివేసి, వ్యాఖ్యలు చేసిన వారిని బయటికి పంపించేసిన పోలీసులు...
సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు, నాలుగో రోజు కూడా అదే ధోరణిలో ప్రవర్తించారు. రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ను ప్రేక్షకులు అసభ్యంగా సంబోధించాడు.
దీంతో అతను వెంటనే అంపైర్లకు ఫిర్యాదు చేయగా ఆట కాసేపు నిలిచిపోయింది. ఆ వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని గుర్తించిన పోలీసులు, వారిని స్టేడియం నుంచి బయటికి పంపించివేశారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారికి టెస్టు మ్యాచ్ చూసేందుకు అనుమతి రద్దు చేసిన పోలీసులు... వారు మద్యం సేవించి ఉండడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తేల్చారు.
ఈ సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా, టీమిండియాకు క్షమాపణలు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి సిరాజ్ నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా... రెండు వారాల్లో పూర్తి విచారణ చేపట్టి, రేసిజం వ్యాఖ్యలు చేసిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
రేసిజం వ్యాఖ్యలు చేసేవారిపై జీవితకాల నిషేధం పాటు కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశాడు మాజీ ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్. భారత మాజీ క్రికెటర్లు కూడా జాతి వివక్షవ్యాఖ్యలు చేసిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారు.