Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: పాక్‌పై టీమిండియా ఘన విజయం... స్మృతి మంధాన హాఫ్ సెంచరీ...

India vs Pakistan T20WC 2022: మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన... 11.4 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన భారత జట్టు...

Commonwealth Games 2022: Team India Women beats Pakistan Women, Smriti Mandhana half century
Author
India, First Published Jul 31, 2022, 6:47 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా జట్టు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వచ్చి ఓడిన భారత మహిళా టీమ్, పాకిస్తాన్‌ని చిత్తు చేసి తొలి విజయాన్ని అందుకుంది. 100 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభం అందించారు...

ఓ ఎండ్‌లో స్మృతి మంధాన బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. తొలి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 9 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, తుబా హసన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మునీబా ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుటైంది...

31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న స్మృతి మంధాన, భారీ సిక్సర్‌తో అర్ధశతక మార్కును అందుకుంది. 16 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన సబ్బినేని మేఘన, విజయానికి 6 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకుంది. 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన స్మృతి మంధాన బౌండరీతో మ్యాచ్‌ని ముగించింది...

వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ మహిళా జట్టు, కామన్వెల్త్ నాకౌట్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆగస్టు 3న బర్బొడాస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు నాకౌట్‌ ప్లేస్‌ని కన్ఫార్మ్ చేసుకుంటుంది.

అంతకుముందు వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది...

పాక్ ఓపెనర్ ఇరామ్ జావెద్, మూడు బంతులాడి పరుగులేమీ చేయకుండానే మేఘనా సింగ్‌ బౌలింగ్‌లో యషికా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుటైంది. సున్నాకే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్‌ని కెప్టెన్ బిస్మా మరూఫ్, మునీబా ఆలీ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు...

19 బంతుల్లో 17 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన స్నేహ్ రాణా... భారత జట్టుకి కావాల్సిన బ్రేక్ అందించింది. అదే ఓవర్ ఆఖరి బంతికి క్రీజులో కుదురుకుపోతున్న ఓపెనర్ మునీబా ఆలీని కూడా పెవిలియన్ చేర్చింది స్నేహ్ రాణా...

30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన మునీబా ఆలీ, స్నేహ్ రాణా బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన అయేషా నసీం, రేణుకా సింగ్ బౌలింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది.

13 బంతుల్లో 10 పరుగులు చేసిన ఒమైమా సోహైల్ 13 బంతుల్లో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. 22 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన అలియా రియాజ్ కూడా రనౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్... 6 బంతుల్లో ఓ ఫో‌ర్‌తో 8 పరుగులు చేసిన ఫాతిమా సనా, షెఫాలీ వర్మ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది...

డియానా బైగ్‌ని రాధా యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ చేసిన యషికా భాటికా, 1 పరుగు చేసిన తుబా హసన్‌ని రనౌట్ చేసింది. రాధా యాదవ్ 18వ ఓవర్ ఆఖరి బంతికి ఖయానత్ ఇంతియాజ్‌ని క్లీన్ బౌల్డ్ చేయడంతో 99 పరుగుల వద్ద పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

ఒకానొక దశలో 96/5 వద్ద ఉన్న పాకిస్తాన్, కేవలం 3 పరుగులు మాత్రమే చేర్చి మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీయగా రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ తలా ఓ వికెట్ తీశారు.. 

Follow Us:
Download App:
  • android
  • ios