18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ మహిళా జట్టు... ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోయిన పాక్... 

కామన్వెల్త్ గేమ్స్ 2022 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టాడు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది...

పాక్ ఓపెనర్ ఇరామ్ జావెద్, మూడు బంతులాడి పరుగులేమీ చేయకుండానే మేఘనా సింగ్‌ బౌలింగ్‌లో యషికా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుటైంది. సున్నాకే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్‌ని కెప్టెన్ బిస్మా మరూఫ్, మునీబా ఆలీ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు...

19 బంతుల్లో 17 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన స్నేహ్ రాణా... భారత జట్టుకి కావాల్సిన బ్రేక్ అందించింది. అదే ఓవర్ ఆఖరి బంతికి క్రీజులో కుదురుకుపోతున్న ఓపెనర్ మునీబా ఆలీని కూడా పెవిలియన్ చేర్చింది స్నేహ్ రాణా...

30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన మునీబా ఆలీ, స్నేహ్ రాణా బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన అయేషా నసీం, రేణుకా సింగ్ బౌలింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది.

13 బంతుల్లో 10 పరుగులు చేసిన ఒమైమా సోహైల్ 13 బంతుల్లో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. 22 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన అలియా రియాజ్ కూడా రనౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్... 6 బంతుల్లో ఓ ఫో‌ర్‌తో 8 పరుగులు చేసిన ఫాతిమా సనా, షెఫాలీ వర్మ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది...

డియానా బైగ్‌ని రాధా యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ చేసిన యషికా భాటికా, 1 పరుగు చేసిన తుబా హసన్‌ని రనౌట్ చేసింది. రాధా యాదవ్ 18వ ఓవర్ ఆఖరి బంతికి ఖయానత్ ఇంతియాజ్‌ని క్లీన్ బౌల్డ్ చేయడంతో 99 పరుగుల వద్ద పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.