IPL 2021: వేదికలు మారినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Banglore) తలరాత మారడం లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చినా మిడిల్ ఆర్డర్ ముంచడంతో ఐపీఎల్ (ipl) రెండో దశలో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మరోవైపు బెంగళూరు నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (chennai Super Kings) ఆడుతూ పాడుతూ ఛేదించింది.

షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే (CSK) జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై (chennai) 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తమిళ తంబీలు.. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా నిలకడతో ఆడి రెండో దశ ఐపీఎల్ (IPL) లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచారు. గత మ్యాచ్ లో చెన్నైకి ఒంటి చేత్తో విజయాన్నిందించిన రుతురాజ్ గైక్వాడ్ (ruthuraj gaikwad) .. బెంగళూరుపైనా అలరించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఫోర్, సిక్సర్ తో తన ఉద్దేశాన్ని చాటిన గైక్వాడ్ (26 బంతుల్లో 38 4*4 6*1).. స్కోరును పెంచే క్రమంలో చాహల్ చేతికి చిక్కాడు. మరో ఎండ్ లో 26 బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఊపు మీద కనిపించిన డూప్లెసిస్ (faf du plesis) మ్యాక్స్వెల్ బౌలింగ్ లో సైనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పది ఓవర్లలో చెన్నై 2 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓపెనర్ల నిష్క్రమణతో బ్యాటింగ్ కు వచ్చిన మోయిన్ అలీ (23) రెండు సిక్సర్లతో టచ్ లో ఉన్నట్టు కనిపించినా హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఇదే క్రమంలో రాయుడు (22 బంతుల్లో 32) కూడా పటేల్ బౌలింగ్ లో డివిలియర్స్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సమయంలో సురేశ్ రైనా (suresh raina) (17*)తో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (mahendra singh Dhioni) (11*) చెన్నైని విజయతీరాలకు చేర్చారు. సీఎస్కే టాపార్డర్ రాణించడంతో మరో 11 బంతులు మిగిలుండగానే ఆ జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ 23/2 ఫర్వాలేదనిపించాడు. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఏడు విజయాలు రెండు ఓటములతో టాప్ ప్లేస్ లో నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ను రెండో స్థానానికి నెట్టింది. ఐదు ఓటములతో బెంగళూరు మూడో స్థానంలో ఉంది.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు.. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్ దానిని సద్వినియోగం చేసుకోలేదు. కెప్టెన్ కోహ్లి (kohli) (53), పడిక్కల్ (70) రాణించినా తర్వాత బ్యాట్స్మెన్ అలా వచ్చి ఇలా వెళ్లడంతో ఆర్సీబీ.. 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పాటు పేలవమైన బౌలింగ్ ఆర్సీబీ అభిమానులను మరోసారి నిరాశలోకి నెట్టింది. కాగా ఐపీఎల్ రెండో దశలో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కాగా బెంగళూరుకు వరుసగా రెండో పరాజయం.