ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రాకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన సీఎస్కే... మహీంద్ర ఎస్యూవీ700లో జావెలిన్ ఏడిషన్..
ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడానికి కారణమైన 87.58 మీటర్లకు గుర్తుగా 8758 నెంబర్తో జెర్సీని రూపొందించిన చెన్నై సూపర్ కింగ్స్... మహీంద్ర ఫ్లాగ్ ఫిష్ ఎస్యూవీ700లో ప్రత్యేకంగా జావెలిన్ ఏడిషన్...
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించి, చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా జాతకం పూర్తిగా మారిపోయింది. ఏషియన్ గేమ్స్లో గోల్డ్ గెలిచినా పెద్దగా గుర్తించుకోలేకపోయిన నీరజ్ చోప్రా, ఒలింపిక్ గోల్డ్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్గా మారిపోయాడు.
ట్రాక్ అండ్ ఫీల్డ్లో 121 ఏళ్ల తర్వాత భారత్కి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... టోక్యో నుంచి వచ్చిన తర్వాత చాలా బిజీ బిజీగా గడిపాడు. సన్మాన కార్యక్రమాలు, సత్కారలు, సభలు, సమావేశాలు... ఇలా క్షణం తీరిక లేకుండా తిరగడం వల్ల మనోడికి జ్వరం కూడా వచ్చేసింది...
ఈ మధ్య కాస్త తీరక దొరకడంతో కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లొచ్చిన నీరజ్ చోప్రా, కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ యూత్కి మరింత చేరువవుతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, నీరజ్ చోప్రాకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.
టోక్యో ఒలింపిక్స్ విజయం తర్వాత ప్రకటించినట్టుగానే నీరజ్కి రూ.కోటి నగదు పారితోషికం అందించిన చెన్నై సూపర్ కింగ్స్, నీరజ్ చోప్రా పేరుతో జెర్సీని కానుకగా ఇచ్చింది. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడానికి కారణమైన 87.58 మీటర్లకు గుర్తుగా 8758 నెంబర్తో జెర్సీని రూపొందించింది చెన్నై సూపర్ కింగ్స్...
సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్వయంగా ఈ జెర్సీని నీరజ్కి అందచేశారు. ‘87.58 నెంబర్ ఎప్పటికీ ప్రతీ భారతీయ క్రీడాభిమాని గుండెల్లో నిలిచిపోయే నెంబర్ అవుతుంది. నీరజ్ చోప్రాకి ఈ జెర్సీని ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం... అతను దేశానికి మరెన్నో పతకాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాం...’ అంటూ కామెంట్ చేశారు కాశీ విశ్వనాథ్..
‘దేశానికి గోల్డ్ గెలిచిన తర్వాత భారత ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానులు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. ఒలింపిక్ మెడల్ గెలిస్తే, ఇలాంటి గుర్తింపు దక్కుతుందని నేనే మాత్రం ఊహించలేదు. ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవడానికి నాకు చేతనైనంత కష్టం నేను పడతాను...’ అంటూ తెలిపాడు నీరజ్ చోప్రా...
Must Read: టీ20 వరల్డ్కప్లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...
ఇదిలా ఉంటే క్రీడాకారుల కష్టాన్ని గుర్తించి, వారికి తన స్టైల్లో బహుమతులు ఇవ్వడం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర ప్రత్యేకత. గబ్బా టెస్టు విజయం తర్వాత ఆ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రిషబ్ పంత్, నవ్దీప్ సైనీలకు ప్రత్యేకంగా ఎస్యూవీ వాహనాలను కానుకగా పంపించాడు ఆనంద్ మహీంద్ర..
ఇప్పటికే నీరజ్ చోప్రాకి ఆనంద్ మహీంద్ర నుంచి ఎస్యూవీ కారు బహుమతిగా అందింది. ఆనంద్ మహీంద్ర ఇచ్చిన కారు నెంబర్ ప్లేట్ కూడా 8758గా రిజిస్టర్ చేయించుకున్నాడు నీరజ్ చోప్రా. అలాగే కారుకి రెండు వైపులా జావెలిన్ వేస్తున్నట్టుగా స్టిక్కర్లతో పాటు 87.58 నెంబర్లను బంగారు వర్ణంలో వేయించుకున్నాడు నీరజ్ చోప్రా...
అలాగే నీరజ్ చోప్రాకి వస్తున్న గుర్తింపు గమనించిన మహీంద్ర సంస్థ, ఫ్లాగ్ ఫిష్ ఎస్యూవీ700లో ప్రత్యేకంగా జావెలిన్ ఏడిషన్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ ఏడిషన్లో వచ్చే తొలికారు కూడా నీరజ్ చోప్రాకే బహుకరిస్తామని ఆనంద్ మహీంద్ర తెలిపారు...