Harpreet Singh Bhatia: ఛత్తీస్గడ్ క్రికెట్ జట్టు రంజీ కెప్టెన్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. తప్పుడు ధృవ పత్రాలతో అతడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడనే ఆరోపణలతో అతడి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఛత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన అతడు.. ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టు లో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధృవపత్రాలను సమర్పించాడు.
తాను బుందేల్ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది.
దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతున్నదని రాంచీలోని విధాన సభ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక ఊసలు లెక్కించాల్సిందే.
భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించకపోవడంతో ఫేడ్ అవుట్ అయ్యాడు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
