బ్రేకింగ్: వరుస కరోనా కేసులు, ఐపీఎల్ నిరవధిక వాయిదా..!
ఐపీఎల్ బయో బబుల్ లో వరుసగా కరోనా కేసులు వస్తుండడంతో ఐపీఎల్ 2021 ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే కోల్కతా ఆటగాళ్లు, చెన్నై స్టాఫ్ కరోనా పాజిటివ్ గా తెల్లగా నేడు తాజాగా సన్ రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా బారినపడ్డాడు. దీనితో ఐపీఎల్ ని నిరవధికంగా బీసీసీఐ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
వైరస్ ఇక్కడకు పాకుతుంది, అక్కడ సోకదు అన్నట్టుగా కాకుండా అత్యంత సురక్షితమైనదని భావించే ఐపీఎల్ బయో సెక్యూర్ బబుల్ ని కూడా ఛేదించి వైరస్ లోపలికి ప్రవేశించి క్రికెటర్లకు కూడా సోకింది. కోల్కతా ఆటగాళ్లలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడగా, పాట్ కమిన్స్ సహా మరికొందరు లక్షణాలతో బాధపడుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఇప్పటివరకు సోకకున్నప్పటికీ... వారి బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సహా మరో ఇద్దరికి వైరస్ సోకింది. ఢిల్లీ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ లో కూడా ఇద్దరు వైరస్ బారిన పడ్డారు.ఇప్పటికే నిన్నటి మ్యాచును, రేపటి మ్యాచును రద్దు చేసారు. నేడు జరగాల్సిన సన్ రైజర్స్, ముంబై మ్యాచుకు ముందు హైదరాబాద్ ఆటగాడు సాహా పాజిటివ్ గా తేలాడు. దీనిథి ఐపీఎల్ ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
నేడు రొటీన్ పరీక్షల్లో గనుక ఆటగాళ్లు పాజిటివ్ గా తేలకుండా ఉండి ఉంటే... కొన్ని రోజుల తరువాత మ్యాచులన్నిటిని ముంబై కి తరలించి అక్కడొకే చోట మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంది.
ఇలా గనుక ఒక్కటే నగరం నుంచి నిర్వహిస్తే ప్రయాణం చేయడం కూడా అవసరం ఉండదని, కరోనా వైరస్ వ్యాప్తి రిస్కును కూడా తగ్గించినట్టవుతుందని, అంతే కాకుండా ముంబై లో మూడు గ్రౌండ్లు అందుబాటులో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వైరస్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచును జూన్ మొదటి వారంలో నిర్వహించాలని కూడా బీసీసీఐ ఆలోచించింది. ముంబై లోనే ఫైనల్ నిర్వహిస్తే భారత్, న్యూజిలాండ్ ప్లేయర్స్ నేరుగా ముంబై నుండే ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో పాల్గొనవచ్చని కూడా యోచన చేసింది. కానీ కరోనా మహమ్మారి దెబ్బకు ఐపీఎల్ నే నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.