Asianet News TeluguAsianet News Telugu

బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీ... ఆఖరి ఓవర్‌లో గెలిచి గట్టెక్కిన వెస్టిండీస్...

హాఫ్ సెంచరీతో రాణించిన విండీస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్... డెత్ ఓవర్లలో చుక్కలు చూపించిన అర్ష్‌దీప్ సింగ్... ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకున్న వెస్టిండీస్...

Brandon King half century helped west Indies win against Team India in 2nd T20I
Author
India, First Published Aug 2, 2022, 2:31 AM IST

వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన తర్వాత స్వదేశంలో టీమిండియాపై ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది వెస్టిండీస్. వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్, తొలి టీ20లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్... అనివార్య కారణాలతో 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది...

139 పరుగుల లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేల్ మేయర్స్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.. 

సిమ్రాన్ హెట్మయర్‌ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ కాగా ఓపెనర్ బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... 

5 పరుగులు చేసిన రోవన్ పావెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, 19వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చి విండీస్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. దీంతో వెస్టిండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి ఓడియన్ స్మిత్ సింగిల్ తీశాడు. అది నో బాల్‌గా తేలడంతో ఫ్రీ హిట్‌లో డివాన్ థామస్ సిక్సర్ కొట్టాడు. 

దీంతో విండీస్ విజయానికి 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. రెండో బంతికి ఫోర్ బాదిన థామస్, వెస్టిండీస్‌కి తొలి విజయాన్ని అందించాడు. 


అంతకుముందు మ్యాచ్ ఆలస్యమైనా భారత జట్టు తొందరపాటు కారణంగా పూర్తిగా 20 ఓవర్ల పాటు కూడా తొలి ఇన్నింగ్స్ సాగలేదు. 19.4 ఓవర్లలో 138 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా... 

ఇన్నింగ్స్ మొదటి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను ఓబెడ్ మెక్‌కాయ్ అవుట్ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకి ఇది 8వ గోల్డెన్ డకౌట్. టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు శ్రీలంకపై పృథ్వీ షా ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

టీ20ల్లో గోల్డెన్ డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌‌గానూ చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ.ఇంతకుముందు శిఖర్ ధావన్‌పై 2021 శ్రీలంక పర్యటనలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 5 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోవడంతో మొదటి ఓవర్‌ 0/1గా ముగిసింది...

రెండో ఓవర్‌లో సిక్సర్‌ బాది స్కోరు బోర్డును తెరిచిన సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన రిషబ్ పంత్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి కాసేపు వికెట్ల పడకుండా అడ్డుకోగలిగారు. 31 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన హర్ధిక్ పాండ్యాని జాసన్ హోల్డర్ అవుట్ చేయగా 30 బంతుల్లో ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన రవీంద్ర జడేజా కూడా ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

మెరుపులు మెరిపిస్తాడని ఆశపడిన దినేశ్ కార్తీక్ 7 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు, భువనేశ్వర్ 1 పరుగు చేసి ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు. 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన ఆవేశ్ ఖాన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జాసన్ హోల్డర్... భారత జట్టు ఇన్నింగ్స్‌‌కి తెరదించాడు.

4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 17 పరుగులు మాత్రమే ఇచ్చిన ఓబెడ్ మెక్‌కాయ్ 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు... భారత జట్టుపై టీ20ల్లో 5+ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఓబెడ్ మెక్‌కాయ్.. 

Follow Us:
Download App:
  • android
  • ios