అర్జున అవార్డుకి ధావన్, బుమ్రాల పేర్లు
గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీల పేర్లను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది. అయితే కేవలం రవీంద్ర జడేజాకు మాత్రమే అవార్డు దక్కింది.
క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన వాళ్లకి కేంద్రం ప్రతి ఏటా అందించే అర్జున అవార్డుకి ఈ ఏడాది టీం ఇండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధవన్ల పేర్లు సిఫార్సు చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీల పేర్లను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది. అయితే కేవలం రవీంద్ర జడేజాకు మాత్రమే అవార్డు దక్కింది. జాతీయ జట్టులోకి వచ్చిన మూడు సంవత్సరాలు పూర్తికాని కారణంగా బుమ్రా ఈ అవార్డుకు అనర్హుడు అయ్యాడు.
అయితే ఈ ఏడాది అతనికి మూడు సంవత్సరాలు పూర్తైన కారణంగా, పైగా అతను ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో నెం.1 బౌలర్ కావడంతో.. అతని పేరును సిఫార్సు చేశామని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే బుమ్రాతో పాటు శిఖర్ ధవన్కి కూడా అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటంతో.. అతని పేరుని కూడా సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ధవన్ తోటి క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఇప్పటికే అర్జున అవార్డు లభించింది. దీంతో ఈ ఏడాది ధవన్ పేరును సిఫార్సు చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.