ఆసియా కప్ 2023 టోర్నీలో లాహోర్లో రెండు మ్యాచులు వీక్షించబోతున్న బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా... మూడు జట్లతో కలిపి టీమ్ డిన్నర్..
పాకిస్తాన్ క్రికెట్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తర్వాత భారత క్రికెట్ బోర్డు నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాకి ఆహ్వానం అందింది..
అయితే భారత హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకైన జై షా, పాకిస్తాన్లో అడుగుపెడితే అది రెండు దేశాల్లో చాలా పెద్ద చర్చకు దారి తీస్తుంది. అయితే జై షా స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా... ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వచ్చాయి..
అయితే వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో సోమవారం సెప్టెంబర్ 4న పాకిస్తాన్ చేరుకున్నారు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీ మధ్య పాకిస్తాన్లో అడుగుపెట్టారు. ఆసియా కప్ 2023 టోర్నీలో లాహోర్లో సెప్టెంబర్ 5న ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక మధ్య గ్రూప్ బీ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న పాకిస్తాన్, గ్రూప్ బీ2 టీమ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగనుంది..
ఈ రెండు మ్యాచులకు ముఖ్య అతిథులుగా రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. బీసీసీఐ ప్రముఖుల కోసం పాక్ క్రికెట్ బోర్డు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
‘పాకిస్తాన్లో రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ సంబంధితమైనదే. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. బీసీసీఐ తరుపున లాహోర్లో ఓ డిన్నర్ ఏర్పాటు చేస్తాం. ఇందులో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు, బోర్డు సభ్యులు పాల్గొంటారు..’ అంటూ ఏఎన్ఐకి వ్యాఖ్యానించాడు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ..
2006లో మొట్టమొదటిసారి పాకిస్తాన్లో పర్యటించిన రోజర్ బిన్నీ, ‘మేం కొలంబోలో మ్యాచులు చూసేందుకు వెళ్లాం. ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ల హోం గ్రౌండ్లో మ్యాచులు చూసేందుకు వచ్చాం. లాహోర్లో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఎదురుచూస్తున్నా..’ అంటూ వ్యాఖ్యానించాడు రోజర్ బిన్నీ..
బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్కి వెళ్లడంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సొంతం చేసుకుంది. అయితే పాక్లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవచ్చు. బీసీసీఐ నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్ వెళ్లి క్షేమంగా తిరిగి వస్తే... పాకిస్తాన్ ఈ విషయాన్ని, ఐసీసీకి నివేదికగా సమర్పించే అవకాశం ఉంది.
బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా పాకిస్తాన్కి వచ్చి వెళ్లినప్పుడు, భారత క్రికెట్ జట్టుకి ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటని భారత క్రికెట్ బోర్డును నిలదీసే అవకాశం పీసీబీకి దొరుకుతుంది.
