BCCI: నాలుగు నెలలుగా చీఫ్ సెలక్టర్ లేని ఆలిండియా సెలక్షన్ కమిటీలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానించింది.
పేరుకు ప్రపంచ క్రికెట్ పెద్దన్న అయినా.. ధనవంతమైన క్రికెట్ బోర్డు అని గుర్తింపు ఉన్నా నాలుగు నెలలు గడుస్తున్నా భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ లేడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ తర్వాత అతడు తన పదవి నుంచి తప్పుకోవడంతో భారత జట్టును ఎంపిక చేసే ఆలిండియా సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ పదవి ఖాళీగానే ఉంది. దీంతో ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. మెన్స్ సెలక్షన్ కమిటీలో మిగిలి ఉన్న ఒక సెలక్టర్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపింది. జోనల్ వైజ్గా సెలక్టర్లను తీసుకుంటున్న బీసీసీఐ.. నార్త్ జోన్ (చేతన్ శర్మ ఈ జోన్ కు చెందినవాడే) కు సెలక్టర్ ను ఎంపిక చేయనుంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. వీరిలో ఒకరు చీఫ్ సెలక్టర్ కాగా మిగిలిన నలుగురు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలిల్ అంకోలా, శ్రీధరన్ శరత్లు ఉన్నారు. చేతన్ శర్మ తప్పుకోవడంతో శివసుందర్ దాస్ తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక కొత్త సెలక్టర్ కావాలనుకునే వ్యక్తి.. ఏడు టెస్టుల లేదా పది వన్డేలు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ఐదేండ్లు దాటి ఉండాలి.
రానున్న మూడు నెలల్లో భారత్ కీలక సిరీస్ లతో పాటు రెండు మెగా టోర్నీలు ఆడాల్సి ఉంది. ఆగస్టులో ఆసియా కప్ జరగాల్సి ఉండగా అక్టోబర్ లో స్వదేశంలోనే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు చీఫ్ సెలక్టర్ రేసులో పడింది. బీసీసీఐ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. జూన్ 30 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో ఎంపికైన అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. కొత్తగా రాబోయే సెలక్టర్.. చీఫ్ సెలక్టర్ గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కొత్త టీమ్.. ఐర్లాండ్ తో భారత సిరీస్ ను ప్రకటించే అవకాశాలున్నాయి.
రేసులో వీరేంద్ర సెహ్వాగ్..
చేతన్ శర్మ స్థానాన్ని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భర్తీ చేసే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై తెరవెనుక మంతనాలు కూడా పూర్తయ్యాయని.. సాలరీ దగ్గరే అసలు చిక్కంతా వస్తుందని తెలుస్తున్నది. చీఫ్ సెలక్టర్ పదవికి బీసీసీఐ యేటా కోటి రూపాయల వేతనం అందిస్తోంది. ఇంత తక్కువకు వీరూ ఒప్పుకోవడం లేదని తెలుస్తున్నది. ఈ విషయంలో రాబోయే నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
