BCCI: దేశవాళీ క్రికెట్ కు ఊతమిచ్చేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయాలు వెల్లడించాడు. 

ప్రపంచ క్రికెట్‌ను ధనబలంతో శాసిస్తున్న బీసీసీఐ దేశవాళీ క్రికెట్ కు గుడ్ న్యూస్ చెప్పింది. డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలకు అందజేసే క్యాష్ ప్రైజ్ లను భారీగా పెంచింది. రంజీలతో పాటు ముస్తాక్ అలీ, దేవదర్, దులీప్ ట్రోఫీ లే గాక మహిళల క్రికెట్ లోనూ ఈ పెరుగుదల రెట్టింపు దశలో ఉంది. దేశవాళీ క్రికెట్ కు ఆయువుపట్టైన రంజీ ట్రోఫీలలో విజేతలకు ఇన్నాళ్లు రూ. 2 కోట్లు ఇస్తుండగా ఇప్పుడు దానిని ఎకాఎకిన రూ. 5 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ మేరకు ట్విటర్ వేదికగా పెరిగిన క్యాష్ ప్రైజ్ వివరాలు పంచుకున్నాడు. భారత క్రికెట్ కు వెన్నుముకగా ఉన్న రంజీలతో పాటు ఇతర ట్రోఫీలకు క్యాష్ ప్రైజ్ ను పెంచడం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందజేస్తుందని తెలిపాడు. 

తాజా వివరాల ప్రకారం రంజీలలో విజేతలకు ఇన్నాళ్లు రూ. 2 కోట్లు క్యాష్ ప్రైజ్ అందజేస్తుండగా ఇప్పుడు అది రూ. 5 కోట్లకు పెంచారు. రన్నరప్‌కు కోటి రూపాయల నుంచి రూ. 3 కోట్లకు పెంచారు. సెమీఫైనల్లో ఓడిన జట్టుకు రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయలకు రెట్టింపు చేశారు. ఇరానీ కప్ విజేతలకు గతంలో రూ. 25 లక్షలు ఇవ్వగా ఇప్పుడు దానిని రూ. 50 లక్షలకు పెంచారు. ఫైనల్ లో ఓడిన టీమ్ కు రూ. 25 లక్షలు అందనుంది. 

Scroll to load tweet…

దులీప్ ట్రోఫీలో గెలిచిన వారికి రూ. 40 లక్షలు, ఓడినవారికి రూ. 20 లక్షలు అందజేస్తుండగా ఇప్పుడు దానిని కోటి రూపాయలు, రూ. 50 లక్షలకు పెంచారు. విజయ్ హజారే ట్రోఫీ విజేతలు గతంలో రూ. 30 లక్షలు అందుకోగా ఇకనుంచి కోటి రూపాయల క్యాష్ ప్రైజ్ అందుకుంటారు. ఓడినవారికి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెరిగింది.

దేవదర్ ట్రోఫీ విజేతలకు గతంలో రూ. 25 లక్షలు ఇవ్వగా ఇప్పుడు అది రూ. 40 లక్షలు అయింది. ఫైనల్ లో ఓడినవారికి రూ. 15 లక్షలు అందజేస్తుండగా ఇప్పుడది రూ. 20 లక్షలకు పెరిగింది. సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతలకు రూ. 25 లక్షల నుంచి రూ. 80 లక్షలకు పెంచగా.. ఓడినవారికి రూ. 10 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు.

ఇక సీనియర్ మహిళల వన్డే ట్రోఫీకి గెలిస్తే రూ. 6 లక్షలు, ఓడినవారికి రూ. 3 లక్షలు దక్కుతుండగా ఇప్పుడది రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు అయింది. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ విజేతలకు రూ. 5 లక్షల నుంచి రూ. 40 లక్షలు, రన్నరప్ కు రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షలకు అందజేయనుంది.