త్వరలో జరగనున్న ఐపీఎల్‌కు సంబంధించి ప్రేక్షకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. స్వదేశంలో జరిగే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఓ డే/నైట్‌ మ్యాచ్‌ను తప్పక నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు

త్వరలో జరగనున్న ఐపీఎల్‌కు సంబంధించి ప్రేక్షకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. స్వదేశంలో జరిగే ప్రతీ టెస్టు సిరీస్‌లో ఓ డే/నైట్‌ మ్యాచ్‌ను తప్పక నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది క్రికెట్‌ ఎంతో గొప్పగా ఉంటుందని.. ఐపీఎల్‌కు తిరిగి ప్రేక్షకులని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని దాదా వెల్లడించారు. అయితే ఇది మరో విజయవంతమైన టోర్నీగా నిలుస్తుందని సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఐపీఎల్‌ వేలం విషయానికొస్తే.. ఇది మెగా వేలం కాదని కానీ చాలా జట్లు ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేలంలో చురుకుగా పాల్గొనాలని చూస్తున్నాయని గంగూలీ వెల్లడించారు.

ప్రతి జనరేషన్‌ మార్పును కోరుకుంటుందని... ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో పింక్‌ బాల్ ఒక ప్రధాన మార్పని దాదా చెప్పారు. టెస్టు క్రికెట్‌ను మనం కాపాడుకోవాలని గంగూలీ వెల్లడించారు.

ఇక ఇటీవల యాంజీయోప్లాస్టీ చేయించుకున్న గంగూలీ తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అదృష్టవశాత్తు అందరూ ఊహించినంత ప్రమాదం కాదని దాదా వెల్లడించారు.