Asia Cup 2025: ఆసియా కప్ 2025 నుంచి భారత్ వైదొలుగుతుందన్న వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.

Asia Cup 2025: పహల్గామ్ ఉద్రిక్తతల తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఆపరేష్ సింధూర్ ను చేపట్టింది. దీని తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్-పాక్ మధ్య దాదాపు అన్ని సంబంధాలు కట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 2025 సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి భారత జట్టు వైదొలగిందనే వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. పలు మీడియా నివేదికల ప్రకారం..  టోర్నమెంట్‌కు భారతదేశమే ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, 2025 పురుషుల ఆసియా కప్ నుంచి వైదొలగాలని బోర్డు నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. 

అలాగే, శ్రీలంకలో జరగనున్న ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ నుంచి కూడా BCCI వైదొలగాలని నిర్ణయించుకుందని పేర్కొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి భారత బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని, క్రీడా ఈవెంట్లలో పాల్గొనడానికి జాతీయ భావన, అయిష్టతను ప్రతిబింబిస్తుందంటూ ప్రస్తావించాయి.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ భావోద్వేగాన్ని హైలైట్ చేస్తూ, ACC అధ్యక్షుడు పాకిస్తాన్ చైర్మన్, PCB చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఉన్నప్పుడు ACC నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు వార్తులు వచ్చాయి. 

వార్తలను ఖండించిన దేవజిత్ సైకియా

సోషల్ మీడియా, మీడియా వేదికలలో వార్తలు వ్యాపించడంతో, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2025 ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడంపై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు.

పురుషుల ఆసియా కప్ నుంచి భారత్ వైదొలుగుతుందన్న వార్తలను, పుకార్లను ఖండించిన సైకియా.. రాబోయే ACC ఈవెంట్‌ల గురించి BCCI ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం బోర్డు ఐపీఎల్, రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనపై దృష్టి సారించిందనీ, ACC ఈవెంట్‌లకు సంబంధించిన ఏ చర్చనైనా బోర్డు ప్రకటిస్తుందని కార్యదర్శి తెలిపారు.

"ఈ ఉదయం నుంచి, ACC ఈవెంట్‌లలో పాల్గొనకూడదనే BCCI నిర్ణయం గురించి కొన్ని వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఇప్పటివరకు, BCCI రాబోయే ACC ఈవెంట్‌ల గురించి చర్చించలేదు లేదా అలాంటి చర్యలు తీసుకోలేదు, ACCకి ఏమీ రాయలేదు. ఈ దశలో, మా ప్రధాన దృష్టి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్, తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌పై ఉంది. పురుషులు, మహిళల జట్లు రెండూ రాబోయే సిరీస్ లపై దృష్టి పెట్టాయి” అని దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.

"ఆసియా కప్ విషయం లేదా ఏదైనా ఇతర ACC ఈవెంట్ సమస్య ఏ స్థాయిలోనూ చర్చకు రాలేదు, కాబట్టి దానిపై ఏదైనా వార్త లేదా నివేదిక పూర్తిగాఊహాజనితమైనది. ఏదైనా ACC ఈవెంట్‌లపై ఏదైనా చర్చ జరిగినప్పుడు, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, దానిని మీడియా ద్వారా ప్రకటిస్తాం" అని ఆయన అన్నారు.

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్

భారత్ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా, 2023లో ఫైనల్లో శ్రీలంకను ఓడించి ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత టోర్నమెంట్‌కు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. భద్రతా ఆందోళనలు, రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ ఆతిథ్య దేశమైన పాకిస్తాన్‌కు జట్టును పంపడానికి BCCI నిరాకరించిన తర్వాత భారత్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.

భారత్, పాకిస్తాన్ కాకుండా బంగ్లాదేశ్, UAE, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, హాంకాంగ్, ఒమన్ కూడా టోర్నమెంట్‌లో భాగం కానున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.

ఆసియా కప్ కాకుండా, రాబోయే మహిళల ODI ప్రపంచ కప్, పురుషుల T20 ప్రపంచ కప్‌లకు కూడా భారత్ ఆతిథ్య హక్కులను పొందింది. మహిళల జట్టు ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లదనీ, పాకిస్తాన్ పాల్గొనడాన్ని నిర్ధారించడానికి హైబ్రిడ్ మోడల్‌ను కోరుకుంటుందని, వారి మ్యాచ్‌లు భారత్ వెలుపల తటస్థ వేదికలో జరగాలని ప్రతిపాదిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ  ధృవీకరించారు.