యజ్వేంద్ర చాహాల్, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు టీ20 సిరీస్‌ నుంచి రెస్ట్... రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం... జట్టులో చోటు కోల్పోయిన ఉమ్రాన్ మాలిక్... 

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి వెళ్లనుంది. ఇప్పటికే ఈ టూర్‌లో ఆడే వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన భారత క్రికెట్ బోర్డు, తాజాగా టీ20 సిరీస్‌కి టీమ్‌ని ప్రకటించింది...

వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాలకు రెస్ట్ కల్పించింది... వన్డే సిరీస్‌కి దూరంగా ఉండే రోహిత్ శర్మ, రిషబ్ పంత్... టీ20 సిరీససమయానికి జట్టుతో కలవనున్నారు..

Scroll to load tweet…

గాయం కారణంగా సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కెఎల్ రాహుల్‌తో పాటు గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉన్న కుల్దీప్ యాదవ్‌లకు కూడా విండీస్‌తో టీ20 సిరీస్‌ జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే విండీస్‌తో టీ20 సిరీస్ ఆడతారని స్పష్టం చేసింది బీసీసీఐ...

జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో ఇషాన్ కిషన్ లేదా రిషబ్ పంత్... రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తారు.. 

నాలుగేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 ద్వారా టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి మరోసారి పొట్టి ఫార్మాట్‌కి పిలిచారు సెలక్టర్లు. భారత ప్రధాన వైట్ బాల్ ఫార్మాట్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన బీసీసీఐ, అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం కల్పించింది...

రవిచంద్రన్ అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌లతో పాటు యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా... స్పిన్నర్ల కోటాలో జట్టులో చోటు దక్కించుకున్నారు... 

దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యాలను ఆల్‌రౌండర్లుగా కొనసాగించిన సెలక్టర్లు... అర్ష్‌దీప్ సింగ్‌కి మరో ఛాన్స్ ఇచ్చి, ఉమ్రాన్ మాలిక్‌ని మాత్రం ఈ సిరీస్‌ నుంచి తప్పించారు. రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లుగా సెలక్ట్ చేసిన బీసీసీఐ, మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్‌లకు అవకాశం ఇచ్చింది...

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి భిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్