BCCI Elections: ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు గా పేరుగాంచిన భారత క్రికెట్  నియంత్రణ మండలి (బీసీసీఐ) లో ఎన్నికల నగారా మోగింది. తదుపరి పాలకమండలి కోసం ఎన్నికలను నిర్వహించనున్నారు. 

బీసీసీఐలో ఎన్నికల నగారా మోగింది. బోర్డులో వివాదాస్పద ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’తో పాటు పలు సవరణలకు సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఎన్నికలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతమున్న పాలకమండలి పదవీకాలం (2019 నుంచి) అక్టోబర్ లో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కొత్త పాలకమండలిని ఎన్నుకోవడానికి గాను బీసీసీఐ ఎన్నికల నోటీఫికేషన్ ను శనివారం రాత్రి విడుదల చేసింది. అక్టోబర్ 18న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం విజేతను ప్రకటిస్తారు. 

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, సెక్రటరీగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఆఫీస్ బేరర్లను కూడా ఎన్నుకోనున్నారు. 

తాజాగా విడుదల చేసిన నోటీఫికేషన్ ప్రకారం.. వివిధ పోస్టులకు గాను అక్టోబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశముంది. అక్టోబర్ 13 మధ్యాహ్నం 3 గంటల వరకు వాటిని పరిశీలన చేస్తారు. అదే రోజు సాయంత్రం చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 15న పోటీలో ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ ను ప్రకటిస్తారు. ఇక అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహించిన అదే రోజు సాయంత్రం విజేతల వివరాలను ప్రకటించనున్నారు. 

ఏ ఏ పోస్టులకు ఎన్నికలు..? 

- అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. 

Scroll to load tweet…

జై షాకే మద్దతు..? 

బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా ఎన్నిక ఖాయమేనని తెలుస్తున్నది. సుమారు 22 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు జైషా కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మరి జై షాకు అవకాశమిస్తే గంగూలీ పరిస్థితి ఏంటన్నదానిపైనా చర్చ జరుగుతున్నది. అయితే దాదాను ఐసీసీకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి బీసీసీఐ పీఠమెక్కేది దాదానో లేక జై షానో తెలియాలంటే అక్టోబర్ 18 సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. 

Scroll to load tweet…