Ashes 2023: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి వరల్డ్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. బర్మీ ఆర్మీ కూడా దీనిని వాడుకుంటోంది.
ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ గా గుర్తింపు పొందిన ‘బర్మీ ఆర్మీ’ ట్విటర్ లో మరో వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన పాత వీడియోను ఉపయోగించుకుని మరోసారి తన కురుచ బుద్దిని ప్రదర్శించింది. దీనిపై టీమిండియా, కోహ్లీ ఫ్యాన్స్ కూడా బర్మీఆర్మీకి గట్టిగానే బదులిస్తున్నారను. తమ దేశానికి చెందిన ఆటగాడికి హైప్ ఇచ్చేందుకు కూడా ఇంగ్లాండ్ కు కోహ్లీ వీడియోను వాడుకోవాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్.. రెండేండ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ మోయిన్ అలీని తీసుకొచ్చింది.
ఇంగ్లాండ్ మెయిన్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో ఆ స్థానాన్ని మోయిన్ అలీతో భర్తీ చేయించింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన అలీ (18) రాణించలేదు. బౌలింగ్ లో మాత్రం.. రెండు వికెట్లు తీశాడు. 33 ఓవర్లు వేసి 147 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే మోయిన్ అలీ కామెరూన్ గ్రీన్ వికెట్ తీసిన అనంతరం ట్విటర్ లో అతడికి వెల్కమ్ చెబుతూ బర్మీ ఆర్మీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇది 2021లో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించినప్పుడు.. చెన్నై టెస్టులో మోయిన్ అలీ, విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో. వీడియోను ట్వీట్ చేస్తూ బర్మీ ఆర్మీ.. ‘మోయిన్ అలీ బ్యాక్ విత్ రెడ్ బాల్ ఇన్ హ్యాండ్’అని క్యాప్షన్ ఇచ్చింది. ఇదే భారత అభిమానులకు కోపం తెప్పించింది.
ఈ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘మోయిన్ అలీ తిరిగొచ్చినందుకు సంతోషమే. కానీ ఆఖరికి మీ ప్లేయర్లకు, టీమ్ కు హైప్ ఇవ్వడానికి కూడా మా కోహ్లీనే కావాల్సి వచ్చింది కదరా..’, ‘మీ ఆటగాళ్లకు హైప్ ఇవ్వడానికి ఇంతకంటే మెరుగైన మార్గాలు వెతకగలరా..? అది కష్టంలే..’, ‘యాషెస్ లో మీరు గెలవడానికి కూడా కోహ్లీని వాడుకుంటున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
