ICC Men's Player Of The Month: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ వెటరన్ ఆల్ రౌండర్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించాడు. మార్చి నెలకు గాను షకిబ్.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఇలా గెలుచుకోవడం షకిబ్ కు ఇది రెండోసారి కావడం విశేషం. కాగా బంగ్లాదేశ్ తరఫున ఈ అవార్డును రెండు సార్లు గెలుచుకున్న ప్లేయర్ మాత్రం షకిబ్ అల్ హసనే కావడం గమనార్హం.
షకిబ్ గతంలో 2021 జులైలో తొలిసారి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆప్ ది మంత్ అవార్డు గెలుపొందాడు. బంగ్లా జట్టు నుంచి ఏ ఆటగాడు కూడా రెండోసారి ఈ అవార్డు గెలుచుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు షకిబ్ సరికొత్త చరిత్ర సృష్టించి ఆ కొరత తీర్చాడు.
కాగా మార్చి నెలలో షకిబ్ తో పాటు న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సారథి కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ అసిఫ్ ఖాన్ లు అతడికి గట్టి పోటినిచ్చినా ఆ ఇద్దరినీ దాటుకుని షకిబ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మార్చి నెలలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తో పాటు టీ20 సిరీస్ కూడా గెలుచుకోవడంలో ఈ ఆల్ రౌండర్ మెరుగైన ప్రదర్శనలు చేశాడు. బంతితో పాటు బ్యాట్ తో కూడా షకిబ్ అద్భుతంగా రాణించాడు.
మార్చిలో ఇంగ్లాండ్ తో ముగిసిన వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ 2-1 తో గెలుచుకోగా ఇక టీ20 సిరీస్ ను అయితే ఏకంగా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండింటిలో షకిబ్ రాణించాడు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ నుంచి షకిబ్ స్వదేశంలో జరిగే సిరీస్ లకు కీలకంగా మారుతున్నాడు. భారత్ ను వన్డే సిరీస్ లో ఓడించడం కూడా షకిబ్ కెప్టెన్సీలోనే. మార్చి నెల మొత్తంలో షకిబ్.. బ్యాటింగ్ లో 353 పరుగులు, 15 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలాఉండగా స్వదేశంలో ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత షకిబ్ ఐపీఎల్ ఆడేందుకు రాలేదు. వచ్చే నెలలో ఆ జట్టు ఐర్లాండ్ పర్యటనతో పాటు కుటుంబంతో గడిపేందుకు గాను షకిబ్ ఐపీఎల్ - 16 నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు.
