Asianet News TeluguAsianet News Telugu

IND W vs AUS W: ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా.. సిరీస్ సమం. 

IND W vs AUS W: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా.. జనవరి 9న జరగనున్న మూడో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

Australia Women beat India Women by 6 wickets KRJ
Author
First Published Jan 7, 2024, 10:52 PM IST

IND W vs AUS W: తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందగా..  రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.

ఆస్ట్రేలియాకు శుభ ఆరంభం

భారత్ 130 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం లభించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు అలిస్సా హీలీ, బెత్ మూనీలు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అలిస్సా హీలీ 26 పరుగులు సాధించగా.. బెత్ మూనీ 20 పరుగులు అందించారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన తహిలా మెక్‌గ్రాత్ 21 బంతుల్లో 19 పరుగులు చేసింది. ఆ తరువాత యాష్లే గార్డనర్ 10 బంతుల్లో 7 పరుగులు చేసి పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

భారత్ బౌలర్లలో దీప్తి శర్మ ప్రతిభా చాటింది. దీప్తి శర్మ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసింది. ఇది కాకుండా శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.  బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో ఆరు బంతులు మిగిలుండగానే ఆసీస్‌ విజయం సాధించింది. శ్రేయంక వేసిన 19 ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో చివరి బంతికి పెర్రీ సిక్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించింది. 
 
నిరాశపరిచిన భారత బ్యాట్స్‌మెన్‌లు 

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. భారత్ తరఫున ఆల్ రౌండర్ దీప్తి శర్మ 27 బంతుల్లో 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు కొట్టింది. అలాగే.. రిచా ఘోష్ 19 బంతుల్లో 23 పరుగులు చేశారు.

అదే సమయంలో ఓపెనర్ స్మృతి మంధాన 26 బంతుల్లో 23 పరుగులు చేసింది. అయితే ఇది కాకుండా హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వంటి బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. ఆస్ట్రేలియా తరఫున కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్ తలో రెండు వికెట్లు తీయగా..ఆష్లే గార్డెనర్ ఓ వికెట్ ను తన ఖాతాలో  వేసుకున్నారు.  

ఉత్కంఠగా మారిన  మూడో టీ20

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను సులువుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.  రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. జనవరి 9న ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో మ్యాచ్ జరగనుంది.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios