పిచ్చెక్కిపోతోంది: సెహ్వాగ్ ట్వీట్, ఆస్ట్రేలియా జట్టుకు చురకలు
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ట్వీట్ చేశాడు. టీమిండియాను ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా జట్టుకు చురకలు అంటించాడు.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కారపూరితమైన ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు చురకలంటించాడు. ఆనందంతో పిచ్చెక్కిపోతోందని సెహ్వాగ్ అన్నాడు.
ఇది సరికొత్త ఇండియా అని, ప్రత్యర్థి ఇంట్లోకి దూరి మరీ కొడుతోందని, జీవితానికి సరిపడా ఆనందాన్ని యువ ఆటగాళ్లు అందించారని ఆయన అన్నాడు అడిలైడ్ ఘోర ఓటమి నుంచి అద్బుతంగా కోలుకుని ఆడిన తీరు అద్భుతమని అన్నాడు.
ఇప్పటి వరకు ప్రపంచ కప్ విజయాలను చూశాం గానీ ఈ విజయం ఎంతో ప్రత్యేకమైందని, అంత మాత్రమే కాదు పంత్ నిజంగానే ప్రత్యేకమైన ఆటగాడని సెహ్వాగ్ ్న్నాడు.
మరో ట్వీట్ లో ఆస్ట్రేలియా జట్టుకు చురకలు పెట్టాడు. భారత జట్టులో ఎంతో మంది ఆటగాళ్లు గాయాల పాలయ్యారని అంటూనే అంతకన్నా ఎక్కువగా ఆస్ట్రేలియా జట్టు అహంకారం, గర్వం దెబ్బ తిన్నాయని ఆయన అన్నాడు.
ఈ టెస్టు సిరీస్ మొత్తం ఓ సినిమాలా సాగిందని, అందులో భారత ఆటగాళ్లంతా హీరోలే అని, అందులో మరికొంత మంది సూపర్ హీరోలని అన్నాడు. దానికితోడు సోమవారం వైరల్ అయిన పంత్ స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్ పాటను గుర్తు చేశాడు స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్... నువ్వు నిజంగా మనసులను గెలుచుకున్నావని అని అన్నాడు.