గిల్ హై కీ మాన్ తా నహీ: శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు
ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో అద్బుతమైన ప్రదర్శన చేసిన శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు భవిష్యత్తు ఆశాకిరణంగా అభివర్ణిస్తున్నారు.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ క్రీడాకురుడు శుభ్ మన్ గిల్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. రెండో ఇన్నింగ్సులో అతను 91 పరుగులు చేసి భారత విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఐదో రోజు మంగళవారం తొలి సెషన్ లో జాగ్రత్తగా సహనంతో ఆడిన గిల్ ఆ తర్వాత చెలరేగిపోయాడు.
మిచల్ స్టార్క్ వేసిన ఓవరులో 6,4,4,4 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే నాథన్ లయోన్ వేసిన బంతికి అతను వికెట్ సమర్పించుకున్నాడు. స్ట్రోక్ ప్లే విషయంలో ఆ యువ ఆటగాడు తన నిబద్ధతను చాటుకున్నాడు. ఫుల్ షాట్స్ తో అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు.
అద్భుతమైన శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ 91 పరుగుల వద్ద ముగిసిందని, తొలి సెంచరీని ఈ ఆటగాడు మిస్ చేసుకున్నాడని, అతను 146 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్ లతో పుజారాతో కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని బిసీసీఐ ట్విట్ చేసింది.
సోషల్ మీడియాలో ఆ 21 ఏళ్ల క్రికెటర్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మొహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
తొలి సెషన్ లో ఆస్ట్రేలియా చేయాల్సిందంతా చేసిందని, కానీ గిల్ హై కీ మాన్ తా నహీ అని అనుకుని ఉంటుందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
శుభ్ మన్ గిల్ దురదృష్టవంతుడే కానీ భవిష్యత్తు క్రీడాకారుల్లో ఒకడని మొహమ్మద్ కైఫ్ అన్నాడు.
ఇండియా టాప్ స్కోరర్ శుభ్ మన్ గిల్, ఇండియా టాప్ వికెట్ టేకర్ సిరాజ్. కానీ ఇద్దరు కూడా మూడు మ్యాచులు మాత్రమే ఆడారని, ఇది సాధ్యమవుతుందని మనం అనుకున్నామా అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.