CWG 2022: టీమిండియాకు ‘గోల్డెన్’ ఛాన్స్.. 162 కొడితే తొలి స్వర్ణం మనదే..
Commonwealth Games: కామన్వెల్త్ క్రీడలలో భాగంగా ఆస్ట్రేలియా-ఇండియాలో బంగారు పతకం కోసం ఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు కాంస్యం నెగ్గగా.. మరికొద్దిసేపట్లో స్వర్ణ, రజత విజేతలు తేలనున్నారు.
రెండున్నర దశాబ్దాల (1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్ లో ఒకేసారి) తర్వాత కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలలో స్వర్ణం సాధించేందుకు భారత మహిళల క్రికెట్ జట్టుకు గొప్ప అవకాశం. బర్మింగ్హామ్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న ‘స్వర్ణ పోరు’లో భారత బౌలర్లు రాణించారు. కంగారూలను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్.. 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ (41 బంతుల్లో 61, 8 ఫోర్లు) రాణించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత జట్టు 120 బంతుల్లో 162 పరుగులు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని సాధిస్తే భారత జట్టు చరిత్ర లిఖించబోతున్నది.
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తాను వేసిన రెండో ఓవర్లోనే రేణుకా సింగ్ ఠాకూర్.. ప్రమాదకర అలీస్సా హీలీ (7) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. వన్ డౌన్ లో వచ్చిన లానింగ్ (26 బంతుల్లో 36, 5 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి బెత్ మూనీ దాటిగా ఆడింది. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు.
ఇద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ముఖ్యంగా మూనీ.. భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. అయితే ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని రాధా యాదవ్ విడదీసింది. ఆమె విసిరిన త్రో తో లానింగ్ రనౌటైంది. అదే ఊపులో భారత్.. తహిలా మెక్గ్రాత్ ను కూడా ఔట్ చేసింది. 11 ఓవర్లలో ఆసీస్.. 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
వికెట్లు పడుతున్నా మూనీ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. ఆష్లే గార్డ్నరత్ తో కలిసి నాలుగో వికెట్ కు 38 పరుగులు జోడించింది. కానీ గార్డ్నర్ ను స్నేహ్ రాణా పెవిలియన్ కు పంపగా.. మూనీనీ ఆమె తన తర్వాతి ఓవర్లో ఔట్ చేసింది. గ్రేస్ హారిస్ (2) ను రేణుకా ఠాకూర్ ఔట్ చేసింది. ఆ తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవడానికేం లేదు.
ఇక భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రాణాలు చెరో రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, రాధా యాదవ్ లకు తలో వికెట్ దక్కింది.