Ashes 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టును చూసేందుకు ఓ అభిమాని ఆస్ట్రేలియా నుంచి ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి లార్డ్స్కు చేరుకున్నాడు. కానీ...
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టీ20ల కంటే ఎక్కువగా స్టేడియాలకు వచ్చి ఈ దిగ్గజ జట్ల సమరాన్ని వీక్షిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని.. యాషెస్ ను ప్రత్యక్షంగా చూడటానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి లండన్ కు చేరుకున్నాడు. కానీ అతడు లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు మాత్రం అసలైందే మరిచిపోయాడు.
లార్డ్స్ టెస్టు చూసేందుకు గాను ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్.. టాస్మానియా నుంచి సిప్రస్, చైనా మీదుగా లండన్ చేరుకున్నాడు. ఇందుకు గాను అతడు ఏకంగా 58 గంటలు ప్రయాణించాడు.
అయితే నార్మల్ టైమ్ లోనే లార్డ్స్ లో మ్యాచ్ లు జరిగితే టికెట్లు దొరకడం కష్టం. అలాంటిది యాషెస్ టెస్టు, అందునా.. బర్మింగ్హోమ్ లో తొలి టెస్టు రసవత్తరంగా ముగియడంతో లార్డ్స్ టెస్టు పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో తొలి రోజే లార్డ్స్ మొత్తం హౌస్ ఫుల్ అయింది. టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి.
58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు. లార్డ్స్ కు చేరుకున్నాక కూడా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ‘నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి..’అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీ ట్విటర్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే చివరికి అక్కడ ఓ అభిమాని మాత్రం.. అతడి వద్ద ఉన్న అదనంగా ఉన్న టికెట్ ను మ్యాట్ కు ఇవ్వడంతో అతడు మూడో సెషన్ నుంచి మ్యాచ్ ను చూసినట్టు ఇదే వీడియో కింద ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇక లార్డ్స్ టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఫస్డ్ డే ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభమైంది. స్టీవ్ స్మిత్ (86 నాటౌట్), అలెక్స్ కేరీ (14 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
