యూఏఈ క్రికెటర్ సంచలనం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు.. 11 సిక్సర్లతో విధ్వంసం.
ICC: ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2019-2023 లో యూఏఈ ఆటగాడు అసిఫ్ అలీ చరిత్ర సృష్టించాడు. 41 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు.

ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి అడుగులు వేస్తున్న యూఏఈ టీమ్.. మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నది. ఆ దేశ క్రికెటర్ అసిఫ్ అలీ ఖాన్ తాజాగా సంచలన ప్రదర్శనతో దుమ్మురేపాడు. నేపాల్ తో జరిగిన వన్డేలో 41 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఈ మ్యాచ్ లో అసిఫ్ అలీ.. 42 బంతుల్లో ఏకంగా 11 సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తద్వారా ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.
ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2019-2023 లో భాగంగా నేపాల్ లోని క్రితిపూర్ లో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ వసీమ్ (63), అరవింద్ (94) లు రాణొంచారు.
175 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన అసిఫ్ అలీ.. నేపాల్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 11 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. అసిఫ్ వీర విజృంభణతో చివరి ఓవర్లలో యూఏఈ భారీగా పరుగులు రాబట్టింది.
ఐసీసీ సభ్య దేశాలతో పాటు అసోసియేట్ దేశాలలో కూడా ఈ సెంచరీ రికార్డు. ఈ జాబితాలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్.. 37 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేశాడు. ఆ తర్వాత జాబితాలో కివీస్ ఆటగాడు కోరె అండర్సన్ (36 బంతులు), పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో), మార్క్ బౌచర్ (44 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బౌచర్ కంటే ముందు స్థానంలో అసిఫే (41 బంతుల్లో) ఉండటం గమనార్హం. అయితే అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నది అసోసియేట్ దేశం తరఫున కావున ఆ దేశాల వరకు చూసుకుంటే అసిఫే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. పాకిస్తాన్ లో పుట్టిన అసిఫ్.. అక్కడ అవకాశాల్లేక యూఏఈకి ఆడుతున్నాడు.
కాగా.. అసిఫ్ సెంచరీతో యూఏఈ భారీ స్కోరు సాధించినా విజయం మాత్రం నేపాల్ నే వరించింది. లక్ష్య ఛేదనలో నేపాల్.. 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఆ జట్టులో కుశఆల్ (50), భీమ్ షర్కీ (67), అరిఫ్ షేక్ (52), గుల్సన్ ఝా (50) లు రాణించారు. నేపాల్ ఇన్నింగ్స్ పూర్తికాకముందే వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నేపాల్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.