పాక్పై లంకదే తొలి విజయం... విజయంతో ఆసియా కప్ 2022 ఫైనల్కి...
ఆసియా కప్ 2022 టోర్నీలో మరోసారి టాస్ గెలిచిన జట్టుకే దక్కిన విజయం... ఫైనల్కి ముందు పాక్పై ఘన విజయం అందుకున్న శ్రీలంక...
ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించిన శ్రీలంక జట్టు, టేబుల్ టాపర్గా ఫైనల్ చేరింది. మరో ఫైనలిస్ట్ పాకిస్తాన్తో జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది లంక... 122 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్, రెండో బంతికే కుశాల్ మెండీస్ వికెట్ కోల్పోయింది. మహ్మద్ హస్నైన్ బౌలింగ్లో ఇఫ్తాన్ అహ్మద్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మెండీస్. ఆ తర్వాత ధనుష్క గుణతిలకని డకౌట్ చేసిన హరీస్ రౌఫ్, లంకకి ఊహించని షాక్ ఇచ్చాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...
12 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ కూడా హరీస్ రౌఫ్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంకను భనుక రాజపక్ష, ఓపెనర్ పథుమ్ నిశ్శంక కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
19 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన భనుక రాజపక్ష, ఉస్మాన్ ఖాదీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన లంక కెప్టెన్ దసున్ శనక, మహ్మద్ హస్నైన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
అయితే అప్పటికే విజయానికి 22 బంతుల్లో 9 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది శ్రీలంక. క్రీజులోకి వచ్చిన వానందు హసరంగ రెండు ఫోర్లు బాది మ్యాచ్ని ముగించాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న పథుమ్ నిశ్శంక, 48 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 19.1 ఓవర్లలో 121 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతూ వస్తున్న బాబర్ ఆజమ్, టాప్ 2 స్కోరర్గా ఉన్న మహ్మద్ రిజ్వాన్ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు..
14 బంతులాడిన ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన నెం.1 టీ20 బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 14 పరుగులు చేసి ప్రమోద్ మదుషాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్తో 13 పరుగులు చేసిన ఫకార్ జమాన్ని కరుణరత్నే అవుట్ చేశాడు...
29 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వానిందు హసరంగ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ 17 బంతుల్లో ఓ సిక్సర్తో 13 పరుగులు చేసి హసరంగ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే అసిఫ్ ఆలీని గోల్డెన్ డకౌట్ చేశాడు వానిందు హసరంగ... 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్.
కుష్దిల్ షా 4 పరుగులు చేసి ధనంజయ డి సిల్వ బౌలింగ్లో అవుట్ కాగా ఉస్మాన్ ఖదీర్ 3 పరుగులు చేశాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు... హరీస్ రౌఫ్ 1 పరుగుకే అవుట్ కావడంతో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్...
వానిందు హసరంగ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుషాన్ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ డి సిల్వ, ఛమీరా కరుణరత్నేలకు చెరో వికెట్ దక్కింది.