Asia Cup 2022: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. దాయాదుల పోరు ఎప్పుడంటే..
Asia Cup 2022: వేదికలు మారుతూ చివరికి యూఏఈకి చేరిన ఆసియా కప్ షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత్-పాక్ లు ఈ పోటీలలో తలపడనున్నాయి.
గడిచిన రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన దారుణ పరాజయానికి బదులు చెప్పడానికి టీమిండియాకు సువర్ణావకాశం దక్కింది. ఈ ఏడాది అక్టోబర్ లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కంటే ముందే ఇరుదేశాల మధ్య మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఇందుకు ఆసియా కప్ వేదిక కానుంది. ఈనెల 27 న మొదలయ్యే ఆసియా కప్నకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
షెడ్యూల్ లో భాగంగా భారత జట్టు.. తమ తొలి మ్యాచ్ ను ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న ఈ ఇరు జట్లు.. ప్రపంచకప్ కంటే ముందే ఢీకొనబోతున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరనుంది. గ్రూప్, సూపర్-4, ఫైనల్ గా జరుగబోయే ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 27న శ్రీలంక-అఫ్ఘనిస్తాన్ మధ్య జరుగనుంది. 28న ఇండియా-పాకిస్తాన్, 30న బంగ్లాదేశ్-అఫ్ఘనిస్తాన్ లు తలపడుతాయి. ఇక ఆగస్టు 31న ఇండియా వర్సెస్ క్వాలిఫైయర్, సెప్టెంబర్ 1న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, సెప్టెంబర్ 2న పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత సూపర్-4 మ్యాచులు సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తారు. అదే నెల 11న దుబాయ్ లో ఫైనల్ జరుగుతుంది. మూడు మ్యాచులు షార్జాలో జరగాల్సి ఉండగా మిగిలిన మ్యాచులన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
రెండు గ్రూపులు, ఆరు జట్లు :
- ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లు ఇప్పటికే అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం యూఏఈ, హాంకాంగ్, సింగపూర్, కువైట్ లు ఆరో జట్టు కోసం పోటీ పడుతున్నాయి. టోర్నీకి ముందే క్వాలిఫైయర్ మ్యాచులను నిర్వహిస్తారు.
- గ్రూప్- ఏ లో ఇండియా, పాకిస్తాన్, క్వాలిఫైయర్ జట్టు (?) ఉంది.
- గ్రూప్- బీలో శ్రీలంక, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
- మ్యాచులన్నీ భారత కాలమానం ఆరుగంటలకు ప్రారంభం కానున్నాయి.
వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల కారణంగా వేదికను యూఏఈకి మార్చారు. శ్రీలంకలో కాకుంటే బంగ్లాదేశ్ లో అయినా టోర్నీని నిర్వహిద్దామని చూసినా ఇప్పుడు అక్కడ వర్షాకాల సీజన్ కారణంగా మ్యాచులు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పవని, యూఏఈలో అయితే అటువంటి సమస్యలేమీ ఉండవనే ఆలోచనతో ఆసియా కప్ ను ఎడారి దేశానికి మార్చిన విషయం తెలిసిందే.
ఇక ప్రపంచకప్ కంటే ముందే పాకిస్తాన్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని భారత్ భావిస్తున్నది. గతేడాది దుబాయ్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో అవమానకర ఓటమిని మూటగట్టుకున్నది. ఆ దెబ్బకు భారత్ తర్వాత కివీస్ తోనూ ఓడి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ తో బదులు తీర్చుకోవాల్సిందేనని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ టోర్నీలో గ్రూప్ దశతో పాటు ఫైనల్ కూడా ఇండియా-పాకిస్తాన్ మధ్యే ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఫైనల్ ఎవరు చేరుతారో..? ఎవరిపై ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.