India vs Pakistan: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ పెవిలియన్ బాటపట్టారు.
ఆసియా కప్ -2022 లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి లీగ్ మ్యాచ్ లో భారత్ కు మరో షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయినా తర్వాత కుదురుకున్నట్టు కనిపించిన భారత్ కు మరో షాక్ తప్పలేదు. నెమ్మదిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 12, 1 సిక్సర్) పెవిలియన్ చేరాడు. కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించిన హిట్ మ్యాన్.. మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టి ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు.
రాహుల్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్) సాధికారికంగా ఆడాడు. రోహిత్ నెమ్మదిగా ఆడినా కోహ్లీ తన మునపటి ఆటను చూపించాడు. తనదైన షాట్లతో ధాటిగా ఆడాడు. కానీ మహ్మద్ నవాజ్ వేసిన పదో ఓవర్లో భారీ షాట్ ఆడి లాంగాఫ్ లో ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
పాకిస్తాన్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్ ఎంతోసేపు నిలువలేదు. 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ తర్వాత గాయపడి ఇటీవలే జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్... గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ అరంగేట్ర బౌలర్ నసీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే రాహుల్ వికెట్ల మీదకు ఆడుకుని వికెట్ సమర్పించుకున్నాడు.
రాహుల్ ఔటైన విధానం చూస్తే గతేడాది టీ20 ప్రపంచకప్ లో షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన సీన్ మరోసారి కనిపించింది. అప్పుడు కూడా రాహుల్.. 8 బంతులాడి 3 పరుగులే చేసి అఫ్రిది బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
తాజా మ్యాచ్ లో కూడా రాహుల్.. ఓపెనర్ గా రోహిత్ శర్మతో బరిలోకి దిగాడు. ఎదుర్కున్న తొలి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని వికెట్ సమర్పించుకున్నాడు. ఇక అదే ఓవర్లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లీ ఎదుర్కున్న రెండో బంతి ఎడ్జ్ కు తాకి స్లిప్స్ కు వెళ్లింది. ఫకర్ జమాన్ క్యాచ్ అందుకునేందుకు ముందకు డైవ్ చేశాడు. కానీ అతడు క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో కోహ్లీకి లైఫ్ దొరికింది.
పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. 3 వికెట్ల నష్టానికి 62పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (8*), సూర్యకుమార్ యాదవ్ (2*) క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా పది ఓవర్లలో 86 పరుగులు చేయాలి.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.అర్ష్దీప్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
