Ashes 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. అయితే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈ పిచ్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు.
భారత్ పర్యటనకు వచ్చే జట్లు నిత్యం ఇక్కడి పిచ్ ల మీద కామెంట్స్ చేస్తుంటాయి. ఇందులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముందుంటాడు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మూడేండ్ల క్రితం భారత పర్యటనకు వచ్చినప్పుడు అహ్మదాబాద్ పిచ్ తో పాటు ఇతర పిచ్ లపై కూడా తీవ్రంగా ట్రోల్ చేశాడు. దీనికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ధీటుగానే కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ నిత్యం ట్విటర్ వేదికగా వాదప్రతివాదలు చేసుకుంటూ ఉంటారు. తాజాగా యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్ పిచ్ పై జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఎడ్జ్బాస్టన్ వేదికగానే ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పిచ్ ఇంగ్లాండ్ లోని రెగ్యులర్ ఫ్లాట్ పిచ్ ల మాదిరిగానే ఉంది. అయితే మెయిన్ పిచ్ చుట్టూ గడ్డి ఉండటం.. ఆ మధ్యలో తారురోడ్డులా పిచ్ కనబడుతుండటంతో వసీం జాఫర్ దానిని టార్గెట్ చేశాడు.
పిచ్ కు సంబంధించిన ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఇదిగో.. ఇదే ఎడ్జ్బాస్టన్ పిచ్. చాలా దగ్గర్నుంచి తీసింది. ఓ లుక్కేయండి..’అని షేర్ చేస్తూనే.. ఇదే ఫోటోల ఎడమవైపున హైవే రోడ్ మీద ప్రాంతాల దూరాన్ని తెలిపే సైన్ బోర్డులు రాసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
జాఫర్ ట్వీట్ పై పలువురు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘గతేడాది ఇంగ్లాండ్ పాకిస్తాన్ టూర్ కు వెళ్లింది. అక్కడ వాళ్లకు సిమెంట్ రోడ్లు ఎదురయ్యాయి. అందుకే ఇక్కడ అడవిలో తారురోడ్డు వేశారు..’, ‘ఫ్లాట్ రోడ్’ అని కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది.. ‘ఈ పిచ్ గురించి మైఖేల్ వాన్ ఎలాంటి ఫిర్యాదు చేయడని నేను భావిస్తున్నా.. ఐసీసీ కూడా ఈ ఫ్లాట్ రోడ్ కు ఎలాంటి రేటింగ్ ఇవ్వజాలదు..’అని కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ అయితే... ‘హైవే విత్ నో హ్యూమన్స్’ అని ఘాటుగా స్పందించాడు.
తొలి టెస్టులో మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. 78 ఓవర్లు ఆడి మరో రెండు వికెట్లు చేతిలో ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిన ఇంగ్లాండ్ డిక్లేర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ సెంచరీతో రాణించాడు.