Ashes 2023: యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆస్టేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహంపై ఆ జట్టు మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో రెండు వికెట్లు ఉన్నా.. సెంచరీ చేసిన బ్యాటర్ క్రీజులో ఉన్నా బెన్ స్టోక్స్.. తొలి రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను 78 ఓవర్లలో 393 పరుగులకే డిక్లేర్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై ఇంగ్లాండ్ మాజీ సారథులు కెవిన్ పీటర్సన్, మైఖేల్ వాన్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది తొందరపాటు చర్య అని కనీసం 450 వరకైనా ఆడిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. టెస్టులలో తొలి ఇన్నింగ్స్ లో అది భారీ స్కోరేనని, ప్రత్యర్థి జట్లు మానసికంగా కూడా ఈ స్కోరును చూసి ఆందోళన చెందుతాయని వాపోయారు.
ఇదే విషయమై కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ... ‘ఇది అతడి కెప్టెన్సీ అని నేనైతే అనుకోవడం లేదు. మొదటి రోజు ఇంగ్లాండ్.. డిక్లేర్ ఇచ్చేముందు మరోసారి ఆలోచిస్తే బాగుండేది. ఎడ్జ్బాస్టన్ క్రమంగా బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్. గతేడాది ఇక్కడ ఇండియాతో ఆడినప్పుడు కూడా దానిని మనం చూశాం. రెండో రోజు కూడా ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. స్టోక్స్ నిర్ణయం నాకు నచ్చలేదు. టెస్టులలో 400, 450 స్కోరు కూడా ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీస్తాయి. నేను కాస్త కటువుగానే చెబుతున్నా ఇదైతే నిజం. నాకైతే ఈ నిర్ణయం నచ్చలేదు. చూద్దాం ఏమవుతుందో..?’ అని కామెంట్ చేశాడు.
వాన్ స్పందిస్తూ... ‘నేనైతే డిక్లేర్ చేసేవాడిని కాదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంగ్లాండ్ జట్టు ప్రపంచంలో మరే జట్టు మాలా చేసి ఉండదు అని ఇతర జట్లకు మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు. నేనైతే నా అభిప్రాయం ప్రకారం.. మరికొన్ని పరుగులు వచ్చాక డిక్లేర్ ఇచ్చేవాడిని. మరీముఖ్యంగా సెంచరీ పూర్తి చేసిన జో రూట్ క్రీజులో ఉన్నాడు.. ఆస్ట్రేలియాకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది..’అని తెలిపాడు.
ఇక తొలి రోజు డిక్లేర్ ఇచ్చిన స్టోక్స్.. ఆ రోజు సాయంత్రంతో ఆసీస్ బ్యాటర్లను మానసికంగా దెబ్బతీస్తే.. ఒకటో రెండో వికెట్లు కోల్పోతే రెండో రోజు కూడా ఒత్తిడి పెంచొచ్చనేది అతడి వ్యూహం. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. తొలి రోజు ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ లు నాలుగు ఓవర్లే ఆడి ఇంగ్లాండ్ కు ఏ అవకాశమూ ఇవ్వలేదు. రెండో రోజు ఫస్ట్ సెషన్ లో మూడు వికెట్లు తీసినా తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో ఆసీస్ కూడా ఇంగ్లాండ్ కు ధీటుగానే బదులిస్తున్నది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 300 పరుగుల మార్కును దాటింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లతో పాటు ఇద్దరు సెట్ బ్యాటర్లు క్రీజులో ఉండటంతో కంగరూలు.. 400 ప్లస్ స్కోరు చేయాలని భావిస్తున్నారు.
