క్రికెట్లో భారీ ఫిక్సింగ్.. నివేదికలో కీలక విషయాలు వెల్లడి
Match Fixing: 2022లో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లలో 13 మ్యాచ్ లు ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ రాడార్ ఓ నివేదికలో వెల్లడించింది.
అంతర్జాతీయ క్రికెట్ లో మరో భారీ కుదుపు. 2022లో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లలో 13 మ్యాచ్ లు ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ రాడార్ ఓ నివేదికలో వెల్లడించింది. స్విట్టర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ.. తన నివేదికలో సంచలన విషయాలు బహిర్గతం చేసింది. ఈ రిపోర్టులో క్రికెట్ తో పాటు ఇతర గేమ్ లు కూడా ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు తేలింది. 92 దేశాల్లో నిర్వహించిన ఈ నివేదికలో 12 క్రీడాంశాలకు సంబంధించిన మ్యాచ్ లు ఉన్నాయి.
28 పేజీలతో కూడిన ఈ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. గతేడాది మొత్తంగా వివిధ క్రీడలకు చెందిన 1,212 మ్యాచ్ లపై అనుమానాలున్నాయని తెలిపింది. ఇందులో అత్యధికంగా ఫుట్బాల్ మ్యాచ్ లు 775 ఉండటం గమనార్హం.
అవినీతి, బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి కారణాలతో ఈ (1,212) మ్యాచ్ లపై అనుమానాలున్నట్టు స్పోర్ట్స్ రాడార్ తన నివేదికలో వెల్లడించింది. ఫుట్బాల్ తర్వాత రెండో స్థానంలో బాస్కెట్ బాల్ ఉంది. ఈ గేమ్ లో 220 మ్యాచ్ లు ఫిక్స్ అయినట్టు స్పోర్ట్స్ రాడార్ తెలిపింది. మూడో స్థానంలో ఉన్న టెన్నిస్ లో 75 మ్యాచ్ లలో అనుమానాస్పదంగా జరిగాయని పేర్కొంది. క్రికెట్ లో ఈ మ్యాచ్ లు 13 ఉన్నాయి.
దేశాల వారీగా చూసుకుంటే యూరప్ ఖండంలో ఏకంగా 630 మ్యాచ్ లు అనుమానాస్పదంగా జరిగాయని తెలిపిన స్పోర్ట్స్ రాడార్.. ఆ తర్వాత ఆసియా (240), సౌత్ అమెరికా (225), ఆఫ్రికా (93), నార్త్ అమెరికా (24) లు ఉన్నాయని తెలిపింది. కాగా 2021తో పోల్చితే గతేడాది అవినీతి, ఫిక్సింగ్ మ్యాచ్ లు భారీగా పెరిగాయి. 2021లో ఈ తరహా మ్యాచ్ లు 905 నమోదైతే 2022లో అవి 1,212 కు పెరగడం గమనార్హం.
ప్రస్తుతం నిబంధనలు కఠినతరం అవడంతో అంతగా వినిపించడం లేదు గానీ గత రెండు దశాబ్దాలలో మ్యాచ్ ఫిక్సింగ్ లు అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలకు తెరతీసేవి. ముఖ్యంగా 90వ, 2000 దశకంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు ప్రపంచ క్రికెట్ లో మాయని మచ్చగా మిగిలాయి. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా దిగ్గజ క్రికెటర్లు కూడా ప్రపంచం ముందు దోషులుగా నిలబడి కెరీర్ ను పాడుచేసుకున్నారు.