Arshdeep Singh: యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ పై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోల్స్ పై అతడి తల్లిదండ్రులు స్పందించారు. ఈ సందర్బంగా వాళ్లు ట్రోల్స్ పై తమ కొడుకు స్పందన గురించి తెలిపారు.
ఆసియా కప్-2022 లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ లో కీలకమైన క్యాచ్ వదిలేసి పరోక్షంగా భారత విజయానికి కారణమైన టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై వాస్తవానికి అర్ష్దీప్ ఎలా స్పందించాడు..? అతడి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయమై తాజాగా అర్ష్దీప్ తల్లిదండ్రులు స్పందించారు.
అర్ష్దీప్ తండ్రి దర్శన్ ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘‘అర్ష్దీప్ ఈ ట్రోల్స్ అన్ని చూసి లైట్ తీసుకుంటున్నాడు. తనపై ట్రోల్స్ రావడంతో అతడు మాకు ఫోన్ చేసి.. ‘ఈ ట్వీట్స్, మెసేజ్లు చూస్తుంటే నాకే నవ్వేస్తుంది.. నేను వీటిలో పాజిటివిటీని మాత్రమే తీసుకుంటున్నాను. ఇవి నన్ను మరింత దృఢంగా మారుస్తున్నాయి..’ అని అన్నాడు.
అంతేగాక.. ‘ఒక తండ్రిగా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా. అర్ష్దీప్ కు ఇంకా 23 సంవత్సరాలే. ట్రోల్స్ గురించి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. ఎందుకంటే మనం విమర్శించే ప్రతి ఒక్కరి నోరును మూయించలేం. అయితే ఫ్యాన్స్ లేకుండా ఏ ఆట ఉండదనే విషయం గ్రహించాలి. అభిమానుల్లో కొంతమంది ఆటకు సంబంధించిన ఏ ఫలితమైనా పాజిటివ్ గా తీసుకుంటారు. కానీ కొంతమంది వీరాభిమానులు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేరు. కానీ వాస్తవం ఏంటంటే.. మ్యాచ్ లో ఎవరో ఒకరు గెలవాల్సిందే. దానిని మనం అర్థం చేసుకోవాలి..’అని అన్నాడు.
ఇక తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్ పై అర్ష్దీప్ తల్లి బల్జీత్ స్పందిస్తూ.. ‘అర్ష్దీప్ తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాతో మాట్లాడాడు. టీమిండియా మొత్తం తనకు మద్దతుగా ఉందని.. ఆ విషయంలో చింత అవసరం లేదని చెప్పాడు. ట్రోల్స్ ను పట్టించుకోవద్దని మాకు సూచించాడు..’ అని తెలిపింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఛేదనలో భాగంగా 17వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా.. మహ్మద్ రిజ్వాన్ ను ఔట్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ.. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్ కు యత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్దీప్.. సింపుల్ క్యాచ్ ను జారవిడిచాడు. ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటికే రిజ్వాన్ వికెట్ కోల్పోవడంతో కొంత ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్కు.. అసిఫ్ అలీ కూడా ఔటై ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో.. కానీ అర్ష్దీప్ క్యాచ్ మిస్ చేయడం వల్ల అసిఫ్ అలీ రెచ్చిపోయాడు. తనకు దొరికిన లైఫ్ తో అతడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
