నన్ను‘నల్లోడా’అని పిలిచారు..డారెన్ స్వామి షాకింగ్ కామెంట్స్
అయితే ఏ ఐపీఎల్ సీజన్ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్మెన్ క్రీడ క్రికెట్లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు.
తాను కూడా వర్ణ వివక్ష ఎదుర్కొన్నానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్వామీ అన్నారు. ఐపీఎల్ సందర్భంగా తన రంగుపై కామెంట్స్ చేశారంటూ పేర్కొన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు.
‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను ‘కాలూ... కాలూ’ (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్లో ‘కాలూ’ అంటే ‘బలమైన వ్యక్తి’ అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది’ అని స్యామీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.
అయితే ఏ ఐపీఎల్ సీజన్ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్మెన్ క్రీడ క్రికెట్లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.... విండీస్కు కెప్టెన్గా రెండు టి20 ప్రపంచకప్లను అందించాడు.
కాగా... అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి పోలీసుల దాష్టీకం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో.. అక్కడ ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ వర్ణ వివక్ష కారణంగా తాము ఎదుర్కొన్న సమస్యను వివరించారు. మొన్నటికి మొన్న క్రిస్ గేల్ కూడా ఇలాంటి కామెంట్స్ చేయగా... ఇప్పుడు డారెన్ స్వామి కూడా చెప్పడం గమనార్హం.