గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్లేందుకు డబ్బులు అడిగిన నెటిజన్... అమిత్ మిశ్రా ఏం చేశాడంటే...
గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్లేందుకు రూ.300 అడిగిన నెటిజన్కి రూ.500 పంపిన క్రికెటర్ అమిత్ మిశ్రా... స్క్రీన్ షాట్ పోస్టు చేసి మరీ...
39 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు భారత క్రికెటర్ అమిత్ మిశ్రా. 2003లో సౌతాఫ్రికాపై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అమిత్ మిశ్రా, టీమిండియా తరుపున 22 టెస్టులు, 36 వన్డేలు, 8 టీ20 మ్యాచులు ఆడాడు...
టెస్టుల్లో 76 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, వన్డేల్లో 64, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడిన అమిత్ మిశ్రా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. క్రికెట్కి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్గా ఉండే అమిత్ మిశ్రా, అన్ని రకాల క్రికెట్ని ఫాలో అవుతూ ఉంటాడు...
తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో సురేష్ రైనా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ వీడియోపై ట్విట్టర్లో స్పందించాడు అమిత్ మిశ్రా. ‘భాయ్ రైనా... నీ టైమ్ మెషిన్ని ఎలా తీసుకోవాల? ఇంతకుముందులా నీ కళ్లు చెదిరే క్యాచ్ని చూడడం చాలా బాగుంది...’ అంటూ కామెంట్ చేశాడు...
ఈ కామెంట్ కింద ఓ నెటిజన్, ‘మిశ్రా జీ... నా గర్ల్ఫ్రెండ్ని డేట్కి తీసుకెళ్లాలి, ఓ 300 రూపాయలు ఇవ్వవా?’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. దానికి ఓ నెటిజన్ యూపీఐ ఐడీ అడగగా... మిశ్రా ఏకంగా రూ.500 పంపి, ఆ స్క్రీన్ షాట్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు...
‘పంపించా... నీ డేట్కి ఆల్ ది బెస్ట్...’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఆ నెటిజన్, మిశ్రాకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి షాహిదీ ఆఫ్రిదీ చేసిన కామెంట్లపై అమిత్ మిశ్రా స్పందించిన తీరు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉన్నప్పుడే రిటైర్ అయితే బాగుంటుంది. ఫామ్లో లేక, జట్టులో చోటు కోల్పోయి రిటైర్మెంట్ ఇస్తే అతనిపై ఉన్న గౌరవం కాస్త తగ్గినట్టు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ...
ఈ కామెంట్లపై స్పందించిన అమిత్ మిశ్రా... ‘డియర్ ఆఫ్రిదీ... కొందరు క్రికెటర్లు కేవలం ఒక్కసారి మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటారు...’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ మాజీ కెప్టెన్ షాహిదీ ఆఫ్రిదీ, తన అంతర్జాతీయ కెరీర్లో ఐదు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
షాహిదీ ఆఫ్రిదీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించడం, ఆ తర్వాత పాకిస్తాన్ ఒకటి రెండు మ్యాచుల్లో ఓడిపోతే... తాను తప్ప పాక్ టీమ్ని ఎవ్వరూ కాపాడలేరని తిరిగి జట్టులోకి రావడం కొనసాగుతూ వచ్చింది. దీనిపై వ్యంగ్యంగా కామెంట్ చేసి, ఆఫ్రిదీకి కౌంటర్ ఇచ్చాడు భారత క్రికెటర్ అమిత్ మిశ్రా...