Ambati Rayudu: రాయుడు ఒత్తిడికి గురయ్యాడా..? క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో.. కొత్త డ్రామా అంటున్న ఫ్యాన్స్
Ambati Rayudu Retirement: శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి.. మళ్లీ 15 నిమిషాలకే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు. అతడు ట్వీట్ డిలీట్ చేయడానికి కారణాలేంటి..? ఇది కూడా డ్రామానేనా..?
ఈ ఏడాది అత్యంత చెత్త ఆటతీరుతో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. తమ పై ఉన్న అటెన్షన్ ను మళ్లించేందుకు కొత్త డ్రామా మొదలుపెట్టిందా..? ఇప్పటికే కెప్టెన్సీ మార్పు విషయంలో విమర్శల పాలైన ఆ జట్టు.. ఇప్పుడు తాజాగా మరో డ్రామాకు తెరతీసిందా..? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ డ్రామాలో పావుగా మారింది అంబటి రాయుడు. తాజాగా అతడు రిటైర్మెంట్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 12 ఏండ్లుగా ఐపీఎల్ ఆడిన తాను ఇక సెలవు తీసుకుంటానని, ఇదే తన చివరి సీజన్ అని శనివారం మధ్యాహ్నం ట్విటర్ వేదికగా ట్వీట్ చేసిన పదిహేను నిమిషాలకే దానిని డిలీట్ చేశాడు. ఈ విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించాడు.
కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ‘లేదు.. లేదు.. అతడు (రాయుడు) రిటైర్ అవడం లేదు. అతడు తన ప్రదర్శనలతో సంతృప్తిగా లేడేమో. ఒత్తిడికి గురై అలా ట్వీట్ చేశాడేమో.. అది ఒక సైకలాజికల్ చర్య. నేను చెబ్తున్నాగా.. అతడు మాతోనే ఉన్నాడు.. ఉంటాడు కూడా...’ అని కుండబద్దలు కొట్టాడు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల సమయంలో ట్వీట్ చేసిన రాయుడు.. 15 నిమిషాలకే తన ట్వీట్ ను డిలీట్ చేశాడు. ట్వీట్ లో రాయుడు.. ఐపీఎల్ లో ఇది నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఐపీఎల్ లో గొప్ప జట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను. ముంబై, సీఎస్కే కు హృదయపూర్వక ధన్యవాదాలు..’ అని పేర్కొన్నాడు.
అయితే రాయుడు నిర్ణయంపై చెన్నై పెద్దలు సీరియస్ అయ్యారట. సీజన్ మధ్యలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, అది కూడా వరుసగా తప్పిదాలతో విమర్శల పాలవుతున్న సమయంలో ఈ షాక్ లు ఏంటని రాయుడును ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. రాయుడు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్ కావడంతో సీఎస్కే యాజమాన్యం హుఠాహుటిన అతడి దగ్గరికెళ్లి.. ఇంకా రెండు మ్యాచులు మిగిలిఉన్నందును ఇప్పుడే ఇలాంటి ట్వీట్లు చేయొద్దని, దానిని వెంటనే డిలీట్ చేయాలని అతడికి గట్టిగానే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా రాయుడు రిటైర్మెంట్ ప్రకటన, ట్వీట్ డిలీట్ పై సోషల్ మీడియా మరో విధంగా మాట్లాడుతున్నది. ఇప్పటికే వరుస వైఫల్యాలు, రవీంద్ర జడేజా కెప్టెన్సీ మార్పు విషయంలో పరువు పోయిన సీఎస్కే.. దానినుంచి అభిమానుల అటెన్షన్ ను మళ్లించేందుకే ఈ ట్రిక్ ప్లే చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓ యూజర్ ట్వీట్ చేస్తూ.. ‘ట్వీట్ లో రాయుడు ధోనికి క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లే దానిని డిలీట్ చేశాడు...’ అని ట్రోల్స్ కూడా నవ్వులు పూయిస్తున్నాయి.