అంబటి రాయుడి యోచన: రిటైర్మెంట్ నుంచి వెనక్కి
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి క్రికెట్ ఆడాలని తపిస్తున్నాడు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడు. గతంలో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
చెన్నై: తన రిటైర్మెంట్ నిర్ణయంపై టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు పునరాలోచనలో పడినట్లు అర్థమవుతోంది. వన్డే ప్రపంచ కప్ టోర్నమెంటుకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ఆయన క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆవేశంలో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇండియాకు, అదే విధంగా ఐపిఎల్ కూడా ఆడాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పాడు.
ప్రపంచ కప్ పోటీల కోసం తాను దాదాపు నాలుగైదు ఏళ్లు తీవ్రంగా కష్టపడ్డానని, అయినా జట్టులోకి తనను తీసుకోకపోవడంతో నిరాశకు గురి కావడం సహజమేనని అన్నాడు. అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాుడు.
ఆ తర్వాత మళ్లీ ఆలోచించుకున్నానని, తిరిగి భారత్ తరఫున ఆడాలని భావిస్తున్నానని అంబటి రాయుడు చెప్పాడు. ప్రస్తుతం అతను టీఎఎస్ఎ వన్డే లీగ్ లో గ్రాండ్ స్లామ్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.