SA 20: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఎ 20 లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సన్ రైజర్స్ ఈప్ట్రన్ కేప్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ (ఎస్ఎ 20) తుది అంకానికి చేరింది. ఈ లీగ్ లో భాగంగా నిన్న రాత్రి సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ - జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో సన్ రైజర్స్ 14 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ సారథి ఎయిడెన్ మార్క్రమ్.. సెంచరీతో చెలరేగి తొలి సీజన్ లోనే ఈస్ట్రన్ కేప్ ను ఫైనల్ కు చేర్చాడు. లక్ష్య ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా పోరాడినా చివరికి సన్ రైజర్స్ నే విజయం వరించింది.
సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీస్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జోర్డాన్ హెర్మన్ (48) రాణించగా.. మార్క్రమ్ 58 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేశాడు. చివర్లోల ట్రిస్టన్ స్టబ్స్ (20), జోర్డాన్ కాక్స్ (6) లు దాటిగా ఆడారు. ఫలితంగా సన్ రైజర్స్.. జోబర్గ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం లక్ష్య ఛేదనలో జోబర్గ్ కూడా దంచికొట్టింది. కెప్టెన్ డుప్లెసిస్ (0) డకౌట్ అయినా రీజా హెండ్రిక్స్ (54 బంతుల్లో 96, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు. మాథ్యూవేడ్ (19), ఫెరారియా (20) లు అతడికి సహకరాం అందించారు. చివర్లోల రొయారియో షెపర్డ్ (14 బంతుల్లో 38 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడి జోబర్గ్ ను విజయం వైపు నడిపించాడు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో జోబర్గ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా.. సన్ రైజర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
జోబర్గ్ పై గెలిచిన సన్ రైజర్స్.. ఎస్ఎ 20 ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సెమీస్ లో క్యాపిటల్స్.. పార్ల్ రాయల్స్ 59 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకున్నది. ఇక ఫైనల్.. ఫిబ్రవరి 11న జోహన్నస్బర్గ్ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ మధ్య జరుగనుంది.