సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న కివీస్కు మరో షాక్.. ఆ ఒక్కడూ ఔట్
టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆదివారం ముగిసిన రెండో మ్యాచ్ లో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జట్టుకు మరో భారీ షాక్ తాకింది.
ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షానికి రద్దు కాగా రెండో మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. సిరీస్ లో చివరిదైన మూడో మ్యాచ్ మంగళవారం నేపియర్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందే కివీస్ కు భారీ షాక్ తాకింది. రెండో మ్యాచ్ లో కివీస్ తరఫున రాణించిన సారథి కేన్ విలియమ్సన్ మూడో మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు.
ఈ మేరకు బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్ క్రికెట్ అధికారిక ట్విటర్ ఖాతా) ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘బ్లాక్ క్యాప్స్ సారథి కేన్ విలియమ్సన్ నేపియర్ లో జరిగే మూడో మ్యాచ్ కు అందుబాటులో ఉండడు. అతడికి అదే తేదీన ముందుగానే తీసుకున్న మెడికల్ అపాయింట్మెంట్ ఉంది..
కేన్ స్థానంలో అక్లాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్ టీ20 జట్టుతో చేరతాడు. ఈ మ్యాచ్ కు టిమ్ సౌథీ సారథిగా వ్యవహరిస్తాడు..’అని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా భారత్ తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ జట్టు తరఫున కేన్ మామ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. 52 బంతుల్లో 61 పరుగులు చేసి కివీస్ పరువు కాపాడాడు. అతడు మినహా మిగిలిన ప్లేయర్లతంతా విఫలమయ్యారు. విధ్వసంకర ఓపెనర్లు ఫిన్ అలెన్ డకౌట్ అవ్వగా.. డెవాన్ కాన్వే (25), గ్లెన్ ఫిలిప్స్ (12), డారిల్ మిచెల్ (10), జేమ్స్ నీషమ్ (0), మిచెల్ సాంట్నర్ (2) లు విఫలమయ్యారు. ఫలితంగా న్యూజిలాండ్.. 192 పరుగుల లక్ష్య ఛేదనలో 18.5 ఓవర్లకు 126 పరుగులకే పరిమితమైంది.
అంతకుముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమిండియాలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (36) మెరవగా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు. సూర్య.. 51 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీ20లలో సూర్యకు ఇది రెండో శతకం.