Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022 లో భాగంగా జరుగుతున్న క్రికెట్ పోటీలలో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన ఆథిత్య ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ తగిలింది.
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో ఆతిథ్య ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి హీథర్ నైట్కు గాయమైంది. దీంతో ఆమె మొత్తం టోర్నీ నుంచి వైదొలిగింది. ఇంగ్లాండ్ జట్టు.. శనివారం భారత్ తో సెమీఫైనల్ కోసం తలపడనున్న తరుణంలో ఈ వార్త ఆ జట్టుకు షాక్కు గురి చేసేదే. కానీ భారత్ కు మాత్రం ఇది ఊరటే..
ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికాతో తొలి టీ20లో గాయపడ్డ హీథర్.. కామన్వెల్త్ గేమ్స్ లో ప్రకటించిన జట్టులో ఇంగ్లాండ్ కు సారథిగా ఎంపికైంది. కానీ ఆమె ఒక్క మ్యాచ్ లో కూడా పాల్గొనలేదు. గాయం తిరగబెట్టడంతో ఆమె డగౌట్ కే పరిమితమైంది.
కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు తమ తొలి మ్యాచ్ లో శ్రీలంకను ఓడించింది. ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లనూ మట్టికరిపించి గ్రూప్-బీలో టాపర్ గా నిలిచింది. దీంతో గ్రూప్-ఏలో ఉన్న భారత జట్టుతో సెమీస్ లో తలపడాల్సి ఉంది. శనివారం భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందే హీథర్ నైట్ గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచి తప్పుకుంది.
ఇదే విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ‘కామన్వెల్త్ గేమ్స్ లో నటాలీ స్కివెర్ ఇంగ్లాండ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా హీథర్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకోవడం లేదు. 14 మందితోనే బరిలోకి దిగుతాం..’ అని తెలిపింది. ఇక కామన్వెల్త్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు హీథర్ ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టును విజయవంతంగా నడిపించే హీథర్ నైట్ లేకపోవడం ఆ జట్టుకు భారీ షాక్ వంటిదే.
